Pragada Kotaiah Jayanthi: ఆంధ్రప్రదేశ్ చేనేత రంగానికి దిశానిర్దేశం చేసి, నేతన్నల హక్కుల కోసం పోరాడిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజా నాయకుడు ప్రగడ కోటయ్యకు కూటమి ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది.
ప్రగడ కోటయ్య జయంతిని ఇకపై అధికారికంగా 'రాష్ట్ర పండుగ'గా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా జులై 26వ తేదీన ఈ వేడుకలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు (GO) జారీ చేసింది.

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సవిత.. నేతన్నల్లో హర్షాతిరేకాలు!
చేనేత పరిశ్రమ మనుగడ కోసం, నేత కార్మికుల సంక్షేమం కోసం ప్రగడ కోటయ్య జీవితాంతం చేసిన అద్భుత సేవలను స్మరించుకుంటూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ప్రభుత్వ చారిత్రక నిర్ణయం పట్ల రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల గొంతుకగా నిలిచిన ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణీయమని, ఆయనకు తగిన గుర్తింపు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆమె చేనేత వర్గాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Pragada Kotaiah Jayanthi: అధికారిక ఏర్పాట్లకు జీఓ జారీ.. రంగంలోకి పరిశ్రమల శాఖ
రాష్ట్ర సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో చేనేత రంగానికి ఉన్న ప్రాధాన్యతను చాటిచెప్పేలా ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. జులై 26న రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే ఈ అధికారిక జయంతి వేడుకల పర్యవేక్షణ, అవసరమైన నిధుల విడుదల మరియు ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని పరిశ్రమలు, వాణిజ్య శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు, పద్మశాలి సామాజిక వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

