Papannapet School: విద్యాబుద్ధులు నేర్పాల్సినఉపాధ్యాయుడిపై బాలికల అనుచిత ప్రవర్తన ఆరోపణలు. గుడ్ టచ్-బ్యాడ్ టచ్ అవగాహన సదస్సులో వెలుగులోకి..
హెల్ప్లైన్ ఫిర్యాదుతో కదిలినఅధికారయంత్రాంగం. పాఠశాలకుచేరుకున్నఐసీడీఎస్ జిల్లా అధికారి.. ప్రధానోపాధ్యాయుడికి జిల్లా విద్యాశాఖ వివరణ కోరినట్లు సమాచారం. విద్యాశాఖ,మహిళా-శిశుసంక్షేమశాఖలవిచారణ.. తాజాగా ఇంటెలిజెన్స్ అధికారులు సైతం ఆరా.
గురువు అంటే గౌరవం.. విద్యార్థులకు భద్రతకు భరోసా.." అని భావించే విద్యా వ్యవస్థలో ఓ ఉపాధ్యాయుడిపై బాలికలు చేసిన అనుచిత ప్రవర్తన ఆరోపణలు పాపన్నపేట మండలంలో కలకలం రేపుతున్నాయి. పాఠశాలలో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను బాలికలు అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అవగాహన సదస్సులో వెలుగులోకి.. ఈ నెల 7న జీసీఈసీ క్లబ్ ఆధ్వర్యంలో 9, 10వ తరగతి బాలికలకు 'గుడ్ టచ్-బ్యాడ్ టచ్' అంశంపై మహిళా ఉపాధ్యాయులు అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా బాలికలతో మాట్లాడుతుండగా.. పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని కొందరు విద్యార్థినులు వెల్లడించినట్లు సమాచారం. ఉపాధ్యాయుడు తమ భుజాలను తాకడం, దగ్గరకు వచ్చి ఇబ్బందికరంగా తాకడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని బాలికలు తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో విషయం తీవ్రంగా పరిగణించిన అధికారులు బాలికల నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం.
హెల్ప్లైన్కు ఫోన్..
రంగంలోకి అధికారులు పాఠశాలలో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను కొందరు విద్యార్థినులు హెల్ప్లైన్కు ఫోన్ చేసి తెలియజేసినట్లు సమాచారం. ఫిర్యాదు అందుకున్న సంబంధిత బృందం ఈ నెల 12న పాఠశాలకు చేరుకుని బాలికలు, సిబ్బంది నుంచి వివరాలు సేకరించినట్లు తెలిసింది. అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిని మెదక్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని సూచించినట్లు సమాచారం. అక్కడ అధికారులు పలు అంశాలపై ప్రశ్నించి వివరణ కోరినట్లు తెలుస్తోంది.
పాఠశాలకు ఐసీడీఎస్ జిల్లా అధికారి
ఈ వ్యవహారంపై మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు సైతం స్పందించినట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిని పిలిపించి విచారణ జరిపి వివరాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఐసీడీఎస్ జిల్లా అధికారి స్వయంగా సంబంధిత పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టినట్లు సమాచారం. విద్యార్థినులు, పాఠశాల సిబ్బంది తదితరుల నుంచి వివరాలు సేకరించి, ఘటనకు సంబంధించిన వాస్తవాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానోపాధ్యాయుడికి జిల్లా విద్యాశాఖవివరణ ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారులు పాపన్నపేట పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కూడా వివరణ కోరినట్లు సమాచారం. దీంతో ప్రధానోపాధ్యాయుడు జిల్లా విద్యాధికారి కార్యాలయానికి వెళ్లి అధికారులకు వివరణ ఇచ్చినట్లు తెలిసింది.
ఇంటెలిజెన్స్ ఆరా..
అధికారుల్లో కదలిక బాలికలు చేసిన ఆరోపణల వ్యవహారం వెలుగులోకి రావడంతో ఈ అంశంపై ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. పాఠశాలలో చోటుచేసుకున్న పరిణామాలు, బాలికలు చేసిన ఆరోపణలు, ఇప్పటివరకు జరిగిన విచారణ తదితర అంశాలపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు, పాఠశాల సిబ్బంది నుంచి కూడా సమాచారం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే విద్యాశాఖ, మహిళా-శిశు సంక్షేమ శాఖ అధికారులు విచారణ చేపట్టగా.. తాజాగా ఇంటెలిజెన్స్ అధికారులు సైతం ఆరా తీస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానిజాలు తేలాల్సి ఉంది. బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన విద్యాసంస్థలో ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.అయితే ఉపాధ్యాయుడిపై వచ్చినవి ప్రస్తుతం విద్యార్థినులు చేసిన ఆరోపణలు మాత్రమే. సంబంధిత శాఖల పూర్తి స్థాయి విచారణ అనంతరం ఆరోపణల్లో వాస్తవమెంత అన్నది తేలాల్సి ఉంది. బాలికల గొంతు వినిపించిన చోట.. అధికారుల స్పందన తప్పనిసరి.
పాఠశాలలో విద్యతో పాటు భద్రత, గౌరవం, నమ్మకానికి భరోసా ఉండాలి

