Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో కుండపోత వాన.. తెలంగాణలోని పలు జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ!

హైదరాబాద్‌లో కుండపోత వాన.. తెలంగాణలోని పలు జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ!

వార్త 5 days ago

Heavy Rains Telangana: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి ముందే తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం భాగ్యనగరాన్ని ముంచెత్తింది.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ కేంద్రం (IMD) ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. రాబోయే 48 గంటల పాటు తెలంగాణవ్యాప్తంగా బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

 Monsoon In Telangana

Read also: Heavy rain in Hyderabad: హైదరాబాద్‌లో భారీ గాలులతో కూడిన వర్షాలు

పలు జిల్లాల్లో అప్రమత్తత.. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే వీలుంది. అలాగే బుధవారం నాడు వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడా ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని అంచనా వేశారు. వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. రుతుపవనాల రాకతో కురుస్తున్న ఈ వర్షాలు వేసవి ఉక్కపోత నుండి ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Heavy Rains Telangana: భాగ్యనగరంలో కుండపోత వాన.. జలమయమైన రహదారులు

గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత, ఉక్కపోతతో సతమతమవుతున్న హైదరాబాద్ వాసులకు మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. అయితే, ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన కుండపోత వాన పడటంతో నగరంలోని పలు ప్రధాన కూడళ్లు, రోడ్లు దారుణంగా జలమయమయ్యాయి.

నగరంలోని ఐటీ కారిడార్ పరిధిలోని హైటెక్ సిటీ, మియాపూర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, చందానగర్‌తో పాటు ముషీరాబాద్, లక్డీకాపూల్, సరూర్‌నగర్, కోఠి, అబిడ్స్, బషీర్‌బాగ్, ట్యాంక్ బండ్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, బాగ్ లింగంపల్లి, రాంనగర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో రహదారులపై మోకాళ్ళ లోతు నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ఈదురుగాలుల ధాటికి రాంనగర్ వీఎస్టీ రోడ్డు, హైదర్‌గూడ తదితర ప్రాంతాల్లో పెద్ద వృక్షాలు, చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. ఫలితంగా వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ముషీరాబాద్ సహా నగరంలోని పలు సబ్‌స్టేషన్ల పరిధిలో చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి, చాలా ప్రాంతాలు చీకట్లోకి వెళ్లిపోయాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

మైనర్ బాలికపై అఘాయిత్యం.. బిల్డింగ్ పైనుంచి తోసేసిన దుర్మార్గుడు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha