Paneer : హైదరాబాద్ నగరంలో నిత్యం వినియోగించే పనీర్ తయారీలో జరుగుతున్న దారుణమైన కల్తీ వ్యవహారం ఒక్కసారిగా కలకలం రేపింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో టాస్క్ఫోర్స్ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో దాదాపు 45 దుకాణాలు, 8 నకిలీ తయారీ కేంద్రాలపై దాడులు చేసి, 825 కిలోల కల్తీ పనీర్ను స్వాధీనం చేసుకున్నారు.
పనీర్ తయారీకి అసలైన పాల కొవ్వు (మిల్క్ ఫ్యాట్)ను ఉపయోగించాల్సి ఉండగా, నిర్వాహకులు లాభాల కోసం చౌకగా దొరికే వెజిటబుల్ ఫ్యాట్స్, స్టార్చ్ పౌడర్, ప్రమాదకరమైన సింథటిక్ పాలను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంతటి ఘోరమైన కల్తీ జరుగుతున్నప్పటికీ, మార్కెట్లో మాత్రం వీటిని ‘ఫ్రెష్ పనీర్’, ‘ప్రీమియం పనీర్’ అనే ఆకర్షణీయమైన బ్రాండ్ల పేర్లతో నమ్మిస్తూ ప్రజలను, హోటల్ నిర్వాహకులను నిలువునా ముంచుతున్న వైనం ఈ తనిఖీల్లో బయటపడింది.
Read Also : రాజకీయాల్లోకి మంత్రి పొంగులేటి అల్లుడు ?

లైసెన్సులు లేని కేంద్రాలు
ఈ తనిఖీల్లో పట్టుబడిన మెజారిటీ తయారీ కేంద్రాలకు కనీస భారతీయ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) లైసెన్స్ కూడా లేకపోవడంతో అధికారులు వాటిపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేశారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో, కెమికల్స్ ఉపయోగించి తయారు చేస్తున్న ఈ నకిలీ పనీర్ను తినడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల తక్షణమే ఫుడ్ పాయిజనింగ్ కావడం, తీవ్రమైన అలర్జీలు రావడం, జీర్ణవ్యవస్థ దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. పండగలు, శుభకార్యాల సీజన్లలో డిమాండ్ను ఆసరాగా చేసుకుని ఇలాంటి నకిలీ పనీర్ మార్కెట్లోకి వస్తోందని, ప్రజలు పనీర్ కొనుగోలు చేసేటప్పుడు నమ్మకమైన దుకాణాలనే ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

