US Air Strikes On Iran: హర్మూజ్ జలసంధి వేదికగా పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. అంతర్జాతీయ సరుకు రవాణా నౌకపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడికి అమెరికా అంతే వేగంగా బదులిచ్చింది.
శుక్రవారం ఇరాన్లోని పలు వ్యూహాత్మక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు భీకర వైమానిక దాడులకు దిగాయి. గత వారమే కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించి, ‘మూర్ఖపు చర్య’కు పాల్పడిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఎం/వీ ఎవర్ లవ్లీ' నౌకపై డ్రోన్ దాడి
జూన్ 25న తైవాన్కు చెందిన ఎవర్గ్రీన్ మెరైన్ సంస్థ నిర్వహిస్తున్న, సింగపూర్ జెండాతో వెళ్తున్న 'ఎం/వీ ఎవర్ లవ్లీ' అనే కంటైనర్ నౌకపై ఇరాన్ వన్-వే అటాక్ డ్రోన్తో దాడి చేసింది. హర్మూజ్ జలసంధి గుండా ఒమన్ తీర ప్రాంతం మీదుగా ఈ నౌక ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. దాడి కారణంగా నౌక పైభాగం, బ్రిడ్జి ఏరియా పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే, అదృష్టవశాత్తూ సిబ్బంది అంతా క్షేమంగా బయటపడ్డారు. ఎలాంటి చమురు లీకేజీ జరగకపోవడంతో పర్యావరణ ముప్పు తప్పింది, దీంతో నౌక తన ప్రయాణాన్ని ముందుకు సాగించింది. ఈ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందనడానికి పక్కా ఆధారాలు ఉన్నాయని అమెరికా నిర్ధారించింది.
US Air Strikes On Iran: ట్రంప్ స్పందన: ‘ట్రూత్ సోషల్’ వేదికగా హెచ్చరిక
ఈ ఉద్రిక్తతలపై డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతా ద్వారా స్పందించారు. ఇరాన్ మొత్తం నాలుగు డ్రోన్లను ప్రయోగించగా, అందులో మూడింటిని అమెరికా రక్షణ దళాలు గాల్లోనే కూల్చేశాయని, కానీ ఒక డ్రోన్ మాత్రం నౌకను ఢీకొట్టిందని ఆయన వివరించారు. అంతర్జాతీయ జలాల్లో రవాణా భద్రత కోసం స్విట్జర్లాండ్ వేదికగా గత వారమే కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఇరాన్ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఇరాన్పై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్న మీడియా ప్రశ్నకు.. “త్వరలోనే మీకే తెలుస్తుంది” అంటూ ట్రంప్ ముందే హెచ్చరించారు.
రంగంలోకి అమెరికా సెంట్రల్ కమాండ్.. లక్షిత దాడులు
ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే అమెరికా సెంట్రల్ కమాండ్ రంగంలోకి దిగి ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇరాన్లోని క్షిపణి లాంచింగ్ ప్యాడ్లు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీరప్రాంత రాడార్ వ్యవస్థలపై కచ్చితమైన లక్ష్యాలతో క్షిపణి దాడులు చేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గాల్లో స్వేచ్ఛను హరించేలా ఇరాన్ చేసిన ఉల్లంఘనకు ఈ దాడులే సరైన సమాధానమని సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.

