Indus Waters Treaty : సింధు జలాల ఒప్పందానికి (Indus Waters Treaty) సంబంధించి హేగ్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టు ఇచ్చిన తీర్పుపై భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది.
ఈ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైందని, కోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలకు ఎటువంటి చట్టబద్ధత లేదని స్పష్టం చేసింది. వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం అలాగే విదేశాంగ శాఖ (MEA) దీనిపై స్పందిస్తూ, ఈ సంస్థ ఉనికిని భారత్ మొదటి నుంచీ గుర్తించలేదని తేల్చిచెప్పాయి. భారత్ ఏకపక్షంగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని సమర్థించలేమని హేగ్ కోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది. పహల్గాం ఉగ్రదాడి, సరిహద్దు భద్రత వంటి కారణాలను చూపుతూ ఒప్పందాన్ని నిలిపివేయడం తగదని కోర్టు అభిప్రాయపడింది. జలాల పంపిణీ బాధ్యతలను భారత్ యథావిధిగా నెరవేర్చాలని ఆదేశిస్తూనే, రత్లే జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై కొన్ని ఆంక్షలు విధించింది.
Read Also: Uttar Pradesh Firecracker Blast: టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు.. ఎనిమిది మంది మృతి
Indus Waters Treaty
Indus Waters Treaty : భారత్ తీవ్ర నిరసన - విదేశాంగ శాఖ స్పష్టత
హేగ్ కోర్టు ఉత్తర్వులను భారత్ ఖరాఖండిగా తోసిపుచ్చింది. భారత సార్వభౌమాధికార నిర్ణయాలు, జాతీయ భద్రత, మౌలిక వసతుల ప్రాజెక్టులపై తీర్పునిచ్చే అధికారం ఏ విదేశీ ట్రిబ్యునల్కూ లేదని విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసినందున భారత్ ఈ కోర్టు విచారణలకు ఎప్పుడూ హాజరుకాలేదని, భవిష్యత్తులో కూడా దీని తీర్పులకు కట్టుబడి ఉండదని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల వల్ల భారత్ చేపడుతున్న జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఎటువంటి ఆటంకం కలగదని విదేశాంగ శాఖ ధ్రువీకరించింది.
పహల్గాం దాడి - ఒప్పందం నిలిపివేత నేపథ్యం
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా, ఉగ్రవాదానికి వ్యతిరేక చర్యల్లో భాగంగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ నిర్ణయంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్, అంతర్జాతీయ వేదికలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ భారత్ తన సార్వభౌమ నిర్ణయానికే కట్టుబడి ఉందని స్పష్టమైంది. ఈ చర్యతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్రమంలో భారత్పై తమ అక్కసును వెల్లగక్కింది. నీటిని తమ ‘రెడ్ లైన్’గా చెప్పుకొచ్చింది. భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ‘యుద్ధ చర్య’గా అభివర్ణించింది. అంతర్జాతీయ వేదికలపై మొసలి కన్నీరు కారుస్తూ భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. కానీ, పాకిస్థాన్ ఉడత బెదిరింపులకు, అంతర్జాతీయ కోర్టుల ఒత్తిళ్లకు భారత్ ఎక్కడా తలవంచలేదు.

