Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హీలియం గ్యాస్ పీల్చుకుని చార్టర్డ్ అకౌంటెంట్ సూసైడ్..

హీలియం గ్యాస్ పీల్చుకుని చార్టర్డ్ అకౌంటెంట్ సూసైడ్..

వార్త 2 weeks ago

Siddipet: సిద్దిపేటకు చెందిన ఓ చార్టర్డ్ అకౌంటెంట్ (CA) హీలియం గ్యాస్ పీల్చి ప్రాణాలు విడిచిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఎలాంటి నొప్పీ లేకుండా చనిపోవచ్చనే భ్రమ్‌తో ఆన్‌లైన్‌లో వెతికి మరీ కొందరు యువకులు ఈ ప్రాణాంతక మార్గాన్ని ఎంచుకోవడం పట్ల నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్ బెట్టింగ్‌ల ఉచ్చులో పడి..

సిద్దిపేట బైపాస్ రోడ్డులోని హరిత హోటల్‌లో సంతోష్ అనే చార్టర్డ్ అకౌంటెంట్ గదిని అద్దెకు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో భారీగా డబ్బులు కోల్పోవడం, ఆ తర్వాత అప్పులపాలై వాటిని ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మానసిక ఒత్తిడికి గురికావడంతోనే అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరణించడానికి ముందు ఎలాంటి నొప్పి లేకుండా ప్రాణాలు ఎలా వదలాలనే విషయాలపై యూట్యూబ్‌లో సెర్చ్ చేసి, హీలియం గ్యాస్ టెక్నిక్‌ను ఎంచుకున్నాడు. కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెబుతూ సూసైడ్ నోట్ రాయడంతో పాటు, గదిలోకి వచ్చే ఇతర వ్యక్తులకు ఆ గ్యాస్ ప్రభావం తగలకుండా “మాస్క్ లేకుండా రావొద్దు” అని ప్రత్యేకంగా రాసిపెట్టడం గమనార్హం.

Siddipet: పెరుగుతున్న ఇలాంటి ఘటనలు

కేవలం సిద్దిపేటలోనే కాకుండా, గతంలోనూ ఇలాంటి విషాదకర సంఘటనలు వెలుగుచూశాయి. గత ఏడాది హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో ప్రైవేట్ కంపెనీలో చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న సురేష్ రెడ్డి సైతం ఇదే పద్ధతిలో హీలియం గ్యాస్ పీల్చి బలవన్మరణానికి పాల్పడ్డారు. అలాగే విశాఖకు చెందిన అఖిల్ అనే యువకుడు కూడా ఇదే డేంజరస్ ట్రెండ్‌కు బలయ్యాడు. క్షణికావేశంలో యువకులు తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు కన్నవారికి తీరని గర్భశోకాన్ని మిగుల్చుతున్నాయి.

అసలు హీలియం గ్యాస్ ప్రాణాంతకం ఎందుకు?

గాలి కంటే చాలా తేలికైన హీలియం గ్యాస్‌ను సాధారణంగా బెలూన్లలో నింపేందుకు, వినోద కార్యక్రమాల్లో గొంతు మ్రోతను మార్చడానికి వాడుతుంటారు. ఈ గ్యాస్‌కు ఎలాంటి వాసన, రంగు ఉండవు. సాధారణంగా ఇది విషపూరితం కానప్పటికీ, శరీరంలో ఆక్సిజన్ అందాల్సిన స్థానంలో ఈ గ్యాస్ గనుక చేరితే అది అత్యంత ప్రాణాంతకంగా మారుతుంది. మెదడుకు ఆక్సిజన్ అందక మొద్దుబారిపోయి, బాధితులు నిమిషాల వ్యవధిలోనే స్పృహ కోల్పోయి మృత్యువాత పడతారు.

నిపుణుల హెచ్చరికలు మరియు అపోహలు

అమెరికాలో పుట్టుకొచ్చిన ఈ ‘నొప్పి లేని మరణం’ అనే అవాస్తవ ట్రెండ్ ఇప్పుడు భారతదేశంలోని యువతను సైతం ఆకర్షిస్తోంది. అయితే, హీలియం పీల్చి చనిపోతే అసలు నొప్పే ఉండదనేది పూర్తిగా అపోహ మాత్రమేనని, ప్రాణం పోయే సమయంలో శరీరం ఎంతో కొంత నష్టాన్ని, నొప్పులను ఎదుర్కొంటుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మానసిక ఒత్తిడి లేదా డిప్రెషన్‌తో బాధపడుతున్న వారు ఒంటరిగా నిర్ణయాలు తీసుకోకుండా, తప్పనిసరిగా కుటుంబ సభ్యులు లేదా నిపుణుల సహాయం (కౌన్సెలింగ్) తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ప్రాణం ఎంతో విలువైనదని గుర్తించి యువత ఇలాంటి ప్రమాదకర ఆలోచనలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

హరీష్ రావు ను పశుపతితో పోల్చిన మహేశ్ గౌడ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha