QUAD Meeting 2026: దిల్లీ వేదికగా మంగళవారం జరిగిన క్వాడ్ (Quad) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం అంతర్జాతీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల వ్యూహాత్మక కూటమి అయిన క్వాడ్..
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మారుతున్న సమీకరణాలపై సుదీర్ఘంగా చర్చించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో సముద్ర భద్రత, ఆర్థిక సహకారం, సవాళ్లను ఎదుర్కొనే వ్యూహాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశాన్ని ప్రారంభిస్తూ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక ప్రసంగం చేశారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి, భద్రతకు ఇండో-పసిఫిక్ ప్రాంతమే ప్రధాన చోదకశక్తి అని ఆయన స్పష్టం చేశారు.
QUAD Meeting 2026
- కీలక సవాళ్ల పరిష్కారం: అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో (Supply Chains) స్థిరత్వం లోపించడం, మౌలిక సదుపాయాల కొరత, తయారీ రంగం ఒకేచోట కేంద్రీకృతం కావడం వంటి లోపాలను భాగస్వామ్య దేశాలు కలిసికట్టుగా పరిష్కరించాలని పిలుపునిచ్చారు.
- వ్యూహాత్మక నమ్మకం: సముద్ర రక్షణను బలోపేతం చేయడంతో పాటు, పరస్పర వ్యూహాత్మక నమ్మకాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని జైశంకర్ నొక్కిచెప్పారు.
QUAD Meeting 2026: కేవలం చర్చల వేదిక కాదు.. కార్యాచరణ కూటమి: మార్కో రూబియో
అమెరికా విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి క్వాడ్ భేటీలో పాల్గొన్న మార్కో రూబియో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్వాడ్ ఇప్పుడు కేవలం మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణ దిశగా దూసుకెళ్తోందని ప్రశంసించారు. ఇంధన భద్రత, కీలక ఖనిజాల సరఫరా, సముద్ర రవాణా స్వేచ్ఛ విషయాల్లో అమెరికా క్వాడ్ కూటమికి కట్టుబడి ఉంటుందని, ఈ భేటీకి భారత్ ఆతిథ్యం ఇవ్వడం అభినందనీయమని రూబియో పేర్కొన్నారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ మాట్లాడుతూ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని చిన్న దేశాల సార్వభౌమ నిర్ణయాధికారాన్ని కాపాడటంలో క్వాడ్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రాంత భవిష్యత్తు రూపకల్పనలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ పాత్ర కీలకమని కొనియాడారు. జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొతేగి మాట్లాడుతూ, ఆర్థిక భద్రత, వ్యూహాత్మక సామర్థ్యాలను వేగంగా పెంపొందించుకోవడానికి క్వాడ్ ఒక సరైన వేదిక అని అభిప్రాయపడ్డారు. గత ఏడాది జూలైలో వాషింగ్టన్లో జరిగిన భేటీకి కొనసాగింపుగా ఈ సమావేశం జరిగింది. ఇటీవల ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా సముద్ర సరిహద్దు వివాదాలు రేపుతూ, వాణిజ్యపరంగా ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఈ దిల్లీ భేటీ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ స్వేచ్ఛాయుత, సురక్షితమైన సముద్ర రవాణాను కాపాడేందుకు నాలుగు దేశాలు ఉమ్మడి కార్యాచరణపై దృష్టి సారించాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

