America Iran War : ప్రస్తుతం పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతుండగా, మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు మళ్లీ మొదలయ్యాయి.
అమెరికా ఇరాన్కు చెందిన క్షిపణి ప్రయోగ కేంద్రాలు, నౌకలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడులు చేసింది. అమెరికాకు చెందిన యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకలకు ముప్పు ఉందని భావించి ముందస్తు చర్యగా ఈ దాడులు నిర్వహించినట్లు సెంట్రల్ కమాండ్ ప్రతినిధి టిమ్ హాకిన్స్ తెలిపారు. ఈ దాడుల్లో బందర్ అబ్బాస్ నౌకాశ్రయం తీవ్రంగా దెబ్బతినగా, లర్క్ ద్వీపంలో నలుగురు ఇరాన్ సైనికులు మరణించినట్లు సమాచారం.
హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
ఇదే సమయంలో ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపుపై వైమానిక దాడులు చేపట్టింది. లెబనాన్లోని టైర్ నగరంపై జరిగిన దాడుల్లో కనీసం 12 మంది పౌరులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్ సైన్యంపై ప్రతిదాడులు చేసినట్లు ప్రకటించింది. త్వరలో వాషింగ్టన్లో లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరగాల్సి ఉండగా, తాజా పరిణామాలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
అమెరికాపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం
అమెరికా దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. చర్చలు కొనసాగుతున్న సమయంలో దాడులకు దిగడం (America Iran War) అమెరికా ద్వంద్వ వైఖరికి నిదర్శనమని టెహ్రాన్ మండిపడింది. ఈ పరిణామాలకు పూర్తి బాధ్యత అమెరికాదేనని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, తమ యురేనియం నిల్వలను అంతర్జాతీయ పర్యవేక్షణలో అప్పగించేందుకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే దాడులు కొనసాగుతున్న సమయంలో అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించడం మరింత సంచలనంగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
సింధు జలాల ఒప్పందం పై భారత్ కు పాక్ విజ్ఞప్తి

