Jagan : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్ తన 'విధ్వంస యాత్రలను' మొదలుపెట్టారని విమర్శించారు.
జగన్ బయట అడుగు పెడితే చాలు సమాజంలో అశాంతి, విధ్వంసం, అరాచకం చెలరేగుతున్నాయని ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘించే నేరస్థులకు, అల్లరిమూకలకు కొమ్ముకాస్తూ, వారికి బహిరంగంగా వత్తాసు పలకడం వైఎస్సార్సీపీ రాజకీయ సంస్కృతికి అద్దం పడుతోందని హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తప్పులు చేసి కక్ష సాధింపు అనడంపై ఆగ్రహం
అనేక అక్రమాలు, తప్పులు చేసి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ విచక్షణారహితంగా మాట్లాడే వారిపై చట్టపరమైన విచారణ జరిపి అరెస్ట్ చేస్తే, దానిని ‘రాజకీయ కక్ష సాధింపు’ అని చిత్రీకరించడంపై హోంమంత్రి అనిత మండిపడ్డారు. నేరాలు చేసిన వారికి కొమ్ముకాస్తూ మళ్లీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి వైఎస్సార్సీపీ నాయకులకు అస్సలు సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటమే కూటమి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని, విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ఎంతటి వారినైనా చట్టం ముందు నిలబెడతామని ఆమె స్పష్టం చేశారు.

