JIO : భారత టెలికాం రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న రిలయన్స్ జియో (Reliance Jio) 2025-26 ఆర్థిక సంవత్సరంలో (FY26) కళ్ళు చెదిరే ఆర్థిక ఫలితాలను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
గడచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఏకంగా ₹1.46 లక్షల కోట్ల భారీ ఆదాయాన్ని (Revenue) గడించినట్లు జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ అధికారికంగా వెల్లడించారు. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం (FY25) తో పోలిస్తే 14.6% అద్భుతమైన వృద్ధిని నమోదు చేయడం విశేషం. అంతేకాకుండా, టెలికాం చరిత్రలోనే తొలిసారిగా అన్ని పన్నులు పోను (Net Profit) సంస్థ నికర లాభం ₹30,000 కోట్ల మార్కును తాకింది. జియో ప్రవేశపెట్టిన వినూత్న ప్లాన్లు, మెరుగైన నెట్వర్క్ సేవలు ఈ స్థాయి రికార్డు లాభాలకు ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

52 కోట్లు దాటిన సబ్స్క్రైబర్లు: 5G విభాగంలో అప్రతిహత వృద్ధి!
ఆర్థిక ఫలితాలతో పాటు యూజర్ల సంఖ్యలోనూ రిలయన్స్ జియో తన ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ప్రస్తుతం జియో మొత్తం సబ్స్క్రైబర్ల సంఖ్య 52.4 కోట్లకు చేరుకుంది. ఇందులో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. మొత్తం వినియోగదారులలో సుమారు సగం మంది, అంటే 26.8 కోట్ల మంది వేగవంతమైన 5G సేవలను వినియోగిస్తున్నారు. కేవలం గడచిన ఒక్క ఏడాదిలోనే ఏకంగా 7.7 కోట్ల మంది కొత్త వినియోగదారులు జియో 5G నెట్వర్క్లోకి రావడం విశేషం. దేశవ్యాప్తంగా 5G మౌలిక సదుపాయాల విస్తరణను జియో వేగవంతం చేయడమే ఈ భారీ వృద్ధికి కారణమని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో డేటా వినియోగం మరింత పెరగనుండటంతో, జియో తన మార్కెట్ లీడర్షిప్ను మరింత కాలం నిలబెట్టుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

