Hyderabad robbery : హైదరాబాద్లోని సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్, నందగిరి హిల్స్ ప్రాంతాలు ఇప్పుడు భయంతో వణికిపోతున్నాయి. పని మనుషుల రూపంలో ఇళ్లలోకి ప్రవేశిస్తున్న కొందరు నేపాలీలు విశ్వాసానికి వెన్నుపోటు పొడుస్తూ హత్యలు, దోపిడీలకు పాల్పడుతుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత మూడు నెలల్లో చోటుచేసుకున్న వరుస ఘటనలు నగరంలో కలకలం రేపుతున్నాయి. ఫిబ్రవరి 6న నందగిరి హిల్స్లో ఓ వ్యాపారి ఇంట్లో పనిచేస్తున్న భూపిందర్ షా అనే నేపాలీ యువకుడు.. ఇంట్లో ఉన్న ఇతర పనివారికి మత్తుమందు ఇచ్చి సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పరారయ్యాడు.
మార్చి 14న జూబ్లీహిల్స్లో మరో వ్యాపారి ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరు నేపాలీలు, యజమాని ఇంట్లో లేని సమయంలో లాకర్లు పగులగొట్టి రూ.3 కోట్ల విలువైన నగలను దోచుకెళ్లారు. తాజాగా మే 8న విశ్రాంత ఐపీఎస్ అధికారి ఇంట్లో పనిచేస్తున్న ఓ నేపాలీ యువతి యజమాని భార్యను హత్య చేసి నగదు, నగలతో పరారైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ వరుస ఘటనల వెనుక ఒకే ముఠా పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తులో ఈ ముఠాల పని తీరు కూడా బయటపడింది. ముందుగా ధనవంతుల ఇళ్లను టార్గెట్ చేసి పని మనుషులుగా చేరుతున్నారని గుర్తించారు. కొన్ని వారాల పాటు నమ్మకంగా పనిచేస్తూ ఇంట్లో నగదు, నగలు ఎక్కడ ఉంచుతున్నారో గమనిస్తున్నట్లు తేలింది. యజమానులు బయటకు వెళ్లిన సమయంలో లేదా ఇంట్లో జాగ్రత్తలు తగ్గినప్పుడు తమ అనుచరులతో కలిసి దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. జరిగిన మూడు ఘటనల్లోనూ ఇదే తరహా పద్ధతి కనిపించిందని అధికారులు చెబుతున్నారు.
అరెస్టయిన నిందితులను విచారించగా మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దోపిడీల వెనుక నేపాల్లో ఉన్న కొందరు మాస్టర్ మైండ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పనివాళ్లను ఎంపిక చేయడం నుంచి దోపిడీ తర్వాత ఎలా పారిపోవాలో కూడా వారే సూచనలు ఇస్తున్నట్లు తేలింది.
Read Also:Renuka Chowdhury : భట్టిపై MP రేణుకా చౌదరి ఆగ్రహం
Hyderabad robberyదోచుకున్న సొత్తుతో పట్టుబడకుండా ఉండేందుకు పుణె, ముంబై వంటి నగరాలను షెల్టర్ జోన్లుగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. గతంలో నగర పోలీసులకు తలనొప్పిగా మారిన రాజస్థాన్కు చెందిన 'ముఖియా గ్యాంగ్' తరహాలోనే ఇప్పుడు ఈ నేపాలీ ముఠాలు కూడా వ్యవహరిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
అయితే నిందితులు నేపాల్కు పారిపోతే వారిని తిరిగి తీసుకురావడం అంత సులభం కాదని, అంతర్జాతీయ నిబంధనల కారణంగా కేసు క్లిష్టమవుతోందని పోలీసులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ఈ ముఠాలను పట్టుకునేందుకు నగర పోలీసులు 'ఆపరేషన్ నేపాల్' పేరుతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఇప్పటికే పాత కేసుల్లో నిందితులుగా ఉన్న పలువురిపై నిఘా పెంచి, వారి కదలికలను గమనిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

