Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూన్ 15 నుంచి బడులు ప్రారంభం.. ప్రభుత్వ స్కూళ్లకు కొత్త సదుపాయాలు

జూన్ 15 నుంచి బడులు ప్రారంభం.. ప్రభుత్వ స్కూళ్లకు కొత్త సదుపాయాలు

వార్త 1 day ago

TG Government Schools: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేసవి సెలవుల అనంతరం వచ్చే సోమవారం (జూన్ 15) నుంచి బడులు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో 2026-27 విద్యా సంవత్సరం అధికారికంగా మొదలవనుంది.

ఈ క్రమంలో పేద విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడమే కాకుండా, విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపడుతోంది. స్కూళ్లలో విద్యార్థుల చేరికలను గణనీయంగా పెంచేందుకు విద్యాశాఖ ఇప్పటికే ‘బడిబాట’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తోంది. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కనీసం 10 శాతం మేర కొత్త అడ్మిషన్లను పెంచాలని ఉపాధ్యాయులకు విద్యాశాఖ స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించింది.

Read also: Mahabubnagar crime: చదువులో ఓటమి.. బలవన్మరణానికి పాల్పడిన ఇంటర్ విద్యార్థి!

 Schools to reopen on June 15; new facilities for government schools.

TG Government Schools: విద్యార్థులకు ఉచిత అల్పాహారం, పాలు!

ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలను పెంపొందించేందుకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే వారికి ప్రత్యేక వర్క్‌బుక్స్ అందించనున్నారు. అంతేకాకుండా, డిజిటల్ విద్యను ప్రోత్సహించేలా రాష్ట్రంలోని 9 వేల ప్రభుత్వ పాఠశాలలకు రాబోయే ఆగస్టు నాటికి హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విద్యార్థుల ఆరోగ్యం, పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారించిన సర్కార్.. మధ్యాహ్న భోజనంతో పాటు ప్రతిరోజూ ఉదయం అల్పాహారం, అలాగే వారానికి మూడు రోజుల పాటు నాణ్యమైన పాలను కూడా అందించాలని నిర్ణయించింది. పాఠశాలలు ప్రారంభమైన రోజునే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ సిద్ధంగా ఉంచినప్పటికీ, యూనిఫాంలు, బూట్లు, బెల్టుల పంపిణీలో స్వల్ప ఆలస్యం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో అధునాతన వసతులు కల్పించనున్నారు.

ఈసారి 1.65 లక్షల అడ్మిషన్లే టార్గెట్!

గత విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కొంతమేర తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 16.78 లక్షల మంది విద్యార్థులు ఉండగా, 2025-26 నాటికి ఆ సంఖ్య 16.58 లక్షలకు పడిపోయింది. అంటే సుమారు 20 వేల మంది విద్యార్థులు తగ్గారు. ఈ నేపథ్యంలోనే కనీసం 10 శాతం మేర చేరికలు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.65 లక్షల మంది కొత్త విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చేరాల్సి ఉంటుంది. అయితే ఈసారి రాష్ట్రంలోని 2,769 పాఠశాలల్లో కొత్తగా ప్రీ-ప్రైమరీ (ఎల్కేజీ, యూకేజీ) తరగతులు ప్రారంభించనున్నందున, దాదాపు 30 వేల నుంచి 40 వేల మంది చిన్నారులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల బాట పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉపాధ్యాయులపై పెరుగుతున్న బోధనేతర పనుల ఒత్తిడి

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచాలనే సర్కార్ తాపత్రయం మరియు వివిధ సంక్షేమ పథకాల అమలు కారణంగా ఉపాధ్యాయులకు బోధనేతర పనులు విపరీతంగా పెరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. సమగ్ర శిక్ష, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, యునిసెఫ్ సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో ఒక దిగ్భ్రాంతికర విషయం వెల్లడైంది. రాష్ట్రంలోని సుమారు 25 శాతం మంది ఉపాధ్యాయులు తమ విధుల్లో భాగంగా బోధనకు కేవలం సగం లేదా అంతకంటే తక్కువ సమయాన్ని మాత్రమే కేటాయించగలుగుతున్నారని, మిగిలిన సమయమంతా ఇతర అడ్మినిస్ట్రేటివ్, రికార్డుల పనులకే సరిపోతోందని ఈ నివేదిక స్పష్టం చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha