Pocharam Srinivas Reddy: బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాక్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
పదవులు లేదా డబ్బుల కోసం కాకుండా, కేవలం తన నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో చేరికపై స్పష్టత
తాను ఏనాడూ పదవులను ఆశించి పార్టీ మారలేదని పోచారం శ్రీనివాస్ రెడ్డి తేల్చిచెప్పారు. మంగళవారం నాడు కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం బాన్సువాడ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలనే ఏకైక ఉద్దేశంతోనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.
Pocharam Srinivas Reddy: పెండింగ్ బిల్లుల నిధుల విడుదలపై అసంతృప్తి
నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం కేవలం సగం నిధులే విడుదల చేయడంపై పోచారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధుల విడుదల ఆలస్యం కావడం వల్ల కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే నిలిపివేశారని తెలిపారు. గత నవంబర్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో తాను ఈ సమస్యను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన గుర్తుచేశారు.
మంత్రులపై పోచారం అసంతృప్తి
ఆరు నెలల కాలంలోనే పెండింగ్ బిల్లులన్నీ మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పటికీ, ఆచరణలో పూర్తి స్థాయిలో నిధులు రాలేదని పోచారం పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అలాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మిగిలిన మొత్తాన్ని మంజూరు చేయడంలో విఫలమయ్యారని, ఈ విషయంలో మరింత చొరవ చూపాలని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

