Dalmia Cement Plant: కడప జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి మరో కీలక అడుగు పడబోతోంది. జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్నకొమెర్లలో ఉన్న దాల్మియా సిమెంటు లిమిటెడ్ లైన్-2 విస్తరణ పనులకు రాష్ట్ర ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం భూమిపూజ చేయనున్నారు.
రూ. 3,478 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక విస్తరణ పనులకు సంబంధించి అధికారులు, యాజమాన్యం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ప్రస్తుతం ఈ చిన్నకొమెర్ల దాల్మియా ప్లాంటులో ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల క్లింకర్, 3.6 మిలియన్ టన్నుల సిమెంటు ఉత్పత్తి అవుతోంది. ఈ రెండో దశ విస్తరణ పూర్తయితే, ప్లాంట్ క్లింకర్ సామర్థ్యం ఏకంగా 6.1 మిలియన్ టన్నులకు, సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 9.6 మిలియన్ టన్నులకు చేరనుంది. ఇది కడప జిల్లాలోనే అత్యంత భారీ పారిశ్రామిక విస్తరణల్లో ఒకటిగా నిలవనుంది.
Read Also : Mudragada Padmanabham Funeral: ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు వద్దు.. ముద్రగడ కుటుంబం!
Dalmia Cement expansion in Kadapa: Minister Lokesh lays the foundation stone.
Dalmia Cement Plant: మరో 700 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు
ప్రస్తుతం నడుస్తున్న ప్లాంట్ ద్వారా సుమారు 950 మంది స్థానికులు ఉపాధి పొందుతున్నారు. ఈ నూతన విస్తరణ ప్రాజెక్టు ద్వారా అదనంగా మరో 700 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వీటితో పాటు ఈ పరిశ్రమకు అనుబంధంగా ఉండే రవాణా (ట్రాన్స్పోర్ట్), గనులు, కాంట్రాక్టులు, సేవా రంగాలు, చిన్న తరహా పరిశ్రమల ద్వారా వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.
అధునాతన టెక్నాలజీ.. ఏఐ రక్షణ వలయం
విస్తరణ చేయబోయే దాల్మియా ప్లాంట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. జర్మనీ, చైనా దేశాల సాంకేతికతతో పాటు పరిశ్రమలో రోబో ల్యాబ్, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు పర్యావరణ హితంగా ఉండే ఈవీ ఆధారిత రవాణా వ్యవస్థ, ప్రత్యేక రైల్వే లాజిస్టిక్ సదుపాయం, రూఫ్టాప్ సోలార్ పవర్ ప్లాంట్ను కూడా నెలకొల్పుతున్నారు. ప్రస్తుతం దాల్మియా సిమెంటు ప్లాంట్ ద్వారా ప్రభుత్వానికి మైనింగ్, రాయల్టీ, ఇతర జీఎస్టీ రూపంలో ఏడాదికి రూ. 102 కోట్ల ఆదాయం వస్తోంది. రెండో దశ ప్లాంటు విస్తరణ పూర్తయితే ఈ రాబడి ఏకంగా రూ. 310 కోట్లకు పెరగనుంది. ఇందులో రూ.120 కోట్లు మైనింగ్ రాయల్టీ రూపంలో, మరో రూ.190 కోట్లు జీఎస్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరనుంది.
కడపకు చేరుకున్న మంత్రి లోకేశ్.. నేటి షెడ్యూల్ ఇదే
మంత్రి నారా లోకేశ్ మంగళవారం సాయంత్రమే కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్తో పాటు పలువురు కూటమి నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి జమ్మలమడుగు మండలం గుత్తి-నెల్లూరు హైవేలో ఉన్న కరమలవారిపల్లె నైట్షెల్టరుకు చేరుకుని రాత్రి బస చేశారు. ఉదయం దాల్మియా ప్రాజెక్టు రెండో దశ విస్తరణ పనులకు శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 2.30 నుండి 4.00 వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, ముఖ్య నేతలతో దొరసానిపల్లె వద్ద ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో మంత్రి లోకేశ్ పాల్గొంటారు.

