Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిల మధ్య సాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ దిల్లీ వేదికకు చేరాయి.
ఈ వివాదంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను మంత్రి కొండా సురేఖ స్వయంగా కలిసి, కడియం శ్రీహరి వైఖరిపై లిఖితపూర్వకంగా, మౌఖికంగా ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే కడియం తన ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని, కావాలనే తనను వివాదాల్లోకి నెడుతున్నారని సురేఖ ఈ భేటీలో ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఇరు పక్షాల మధ్య జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఆమె ఇన్ఛార్జ్కు క్షుణ్ణంగా వివరించారు.

Konda Surekha: సంయమనం పాటించాలన్న అధిష్ఠానం
మంత్రి సురేఖ వెళ్లబుచ్చిన అసంతృప్తిని, ఆమె చెప్పిన వివరాలను నిశితంగా విన్న మీనాక్షి నటరాజన్ ఆమెకు కీలక సూచనలు చేశారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా చిన్న చిన్న మనస్పర్థలను పెద్దవి చేయవద్దని, ఇలాంటి విషయాల్లో కాస్త సంయమనంతో వ్యవహరించాలని సలహా ఇచ్చారు. కాగా, ఈ వివాదానికి సంబంధించి మంత్రి కొండా సురేఖ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను కూడా కలిసి కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పంచాయితీ ఏఐసీసీ ఇన్ఛార్జ్ వద్దకు చేరడంతో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

