Central Government Debt : భారత కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పుల భారం 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 201.17 లక్షల కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ పార్లమెంట్లో అధికారికంగా వెల్లడించారు.
2014-15 నాటికి రూ. 64.11 లక్షల కోట్లుగా ఉన్న ఈ బకాయిలు, గత 11 ఏళ్ల కాలంలో ఏకంగా 214 శాతం మేర పెరిగాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత పదేళ్ల కాలంలో ప్రభుత్వం నికరంగా రూ. 125.99 లక్షల కోట్ల మేర నూతనంగా అప్పులు చేయగా, పాత అప్పుల చెల్లింపుల (Principal Repayment) కింద రూ. 30.94 లక్షల కోట్లను తిరిగి చెల్లించినట్లు మంత్రి సభకు వివరించారు.

మూలధన సృష్టికే అధిక ప్రాధాన్యం:
ప్రభుత్వం వివరణ తీసుకున్న అప్పుల్లో సగానికి పైగా మొత్తాన్ని ఉత్పాదక రంగాలైన మౌలిక సదుపాయాల కల్పనకే వెచ్చించినట్లు ప్రభుత్వం తెలిపింది. జాతీయ రహదారులు, రైల్వేలు, ఓడరేవులు (Ports), విమానాశ్రయాలు, మరియు రక్షణ రంగం (Defense) వంటి కీలక ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ మూలధన వ్యయం (Capital Expenditure) ద్వారా దీర్ఘకాలికంగా ఆస్తులు ఏర్పడటంతో పాటు ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతాయని, ఇది దేశ పురోగతికి ఎంతగానో దోహదపడుతుందని స్పష్టం చేశారు.

