Ketan Agarwal case: పుణేకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ రోజుకోక సంచలన విషయం వెలుగులోకి వస్తూ పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్కు సంబంధించిన స్నాప్చాట్ చాటింగ్ ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది.
నిందితురాలు సియా గోయల్ తన స్నేహితురాలికి పంపిన ఒక మెసేజ్ ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో ప్రాధాన్యత సంతరించుకుంది. ''ఎప్పటికీ జరగని పెళ్లి కోసం టికెట్ బుక్ చేయాలంటే నీ ఆధార్ కార్డు పంపు'' అంటూ సియా మెసేజ్ పంపినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ చాట్ నిజమైనదేనా? లేదా హత్యకు ముందే రచించిన పక్కా ప్రణాళికలో భాగమా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేతన్ కుటుంబానికి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయనే నమ్మకం కలిగించి, ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకే విమాన టికెట్లు బుక్ చేయాలని భావించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాకపోతే, ఈ చాట్ ప్రామాణికత ఇంకా అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు.
Read Also: Suryapet Accident: మద్యం మత్తులో ఘర్షణ.. కాలితో తన్నడంతో లారీ కింద పడి యువకుడి దుర్మరణం
Shocking facts about Sia on Snapchat
Ketan Agarwal case: డిలీట్ చేసిన డేటాలో ‘కోడ్ భాష’ గుర్తింపు
పోలీసుల లోతైన దర్యాప్తులో మరో కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరూ తమ ఫోన్లలో సాధారణంగా కాకుండా, ప్రత్యేక కోడ్ భాషలో మాట్లాడుకున్నట్లు పోలీసులు కనుగొన్నారు. అంతేకాకుండా ఒకరి పేర్లను మరొకరు మారుపేర్లతో సేవ్ చేసుకున్నట్లు డిలీట్ చేసిన డేటాను రికవరీ చేసినప్పుడు స్పష్టమైంది. పోలీసుల దర్యాప్తును పూర్తిగా తప్పుదారి పట్టించేందుకే వారు ముందుస్తు ప్రణాళికతో ఈ పద్ధతిని అనుసరించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ఈ కేసులో మరింత సమాచారాన్ని రాబట్టేందుకు సియా, చేతన్లను ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు భావించారు. ఇందుకోసం మరో మూడు రోజుల పోలీసు కస్టడీ ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే, పోలీసుల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో నిందితులు ఇద్దరికీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
విచారణలో భాగంగా నిందితులకు పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించే అంశం కూడా తెరపైకి వచ్చింది. అయితే, ఈ పరీక్షకు నిందితులు ఇద్దరూ అంగీకరించకపోవడంతో కోర్టు పరీక్షకు అనుమతిని నిరాకరించింది. మరోవైపు ఈ కేసులో ప్రస్తుతానికి పరీక్ష అవసరం లేదని ప్రాసిక్యూషన్ కూడా కోర్టుకు తెలపడం గమనార్హం.
Epaper: epaper.vaartha.com

