Ketan Agarwal Murder Case: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన పూణె రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో రోజుకో కొత్త మలుపు వెలుగుచూస్తోంది.
లోహగఢ్ కోటపై నుంచి తోసేసి కేతన్ను అంతమొందించిన కేసులో అరెస్టయిన అతడి కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ప్రస్తుతం పోలీసుల విచారణలో ఒకరిపై ఒకరు తప్పు నెట్టేసుకుంటున్నారు. ఈ దారుణ స్కెచ్ అంతా అవతలి వ్యక్తిదేనంటూ కస్టడీలో పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రమాదం కాదు.. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన మర్డర్!
రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న 26 ఏళ్ల కేతన్ అగర్వాల్, జూన్ 18న లోనావాలా సమీపంలోని లోహగఢ్ కోట లోయలో పడి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రారంభంలో దీనిని ఒక ప్రమాదంగా భావించినప్పటికీ, పోలీసుల లోతైన దర్యాప్తులో ఇదొక వ్యూహాత్మక హత్యగా తేలింది. తమ ప్రేమ బంధానికి కేతన్ అడ్డంగా ఉన్నాడనే పగతోనే సియా, చేతన్ కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో స్పష్టమైంది.
తనకు ఈ వివాహం చేసుకోవడం ఇష్టం లేదని సియా చెప్పినప్పటికీ, కేతన్ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడానికి అంగీకరించలేదు. దీంతో అతడిని వదిలించుకోవాలని సియా నిర్ణయించుకుంది. ఈ హత్యాకాండకు సియా గోయల్ మైండ్ గేమ్ ఆడగా, కేతన్ను లోయలోకి నెట్టడంలో చేతన్ భౌతికంగా సహకరించినట్లు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. అంతకుముందు నాలుగు రోజుల క్రితమే ఒకసారి కేతన్ను కొండపై నుంచి నెట్టేయడానికి ప్రయత్నించగా అతడు తృటిలో తప్పించుకున్నాడని, ఆ సమయంలో అక్కడ పాము ఉందంటూ సియా కట్టుకథలు చెప్పి నమ్మించిందని దర్యాప్తులో బయటపడింది.
కోటపై 'సియా' కూర్చోవడమే సంకేతం.. సీసీటీవీల్లో గుట్టు రట్టు!
హత్య జరిగిన రోజున కొన్ని గంటల ముందే ఒక కేఫ్లో కలుసుకున్న నిందితులు ఇద్దరూ ప్లాన్ను ఫైనల్ చేశారు. పట్టుబడకుండా ఉండేందుకు 33 డిగ్రీల తీవ్రమైన ఎండ ఉన్నప్పటికీ చేతన్ హుడీ ధరించి కోటపైకి వెళ్లాడు. ప్లాన్ ప్రకారం కోటపై సియా కింద కూర్చోవడమే సంకేతంగా (సిగ్నల్) భావించిన చేతన్, వెంటనే కేతన్ను లోయలోకి నెట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కాల్ డేటా, ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వీరి గుట్టును రట్టు చేశారు.
కేతన్ మరణించినట్లు తెలిసినా సియా ముఖంలో ఎలాంటి బాధ కానీ, చలనం కానీ లేకపోవడంతో కేతన్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. ప్రస్తుతం నిందితులిద్దరూ ఏడు రోజుల పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ ఘోరకలిపై సియా తల్లిదండ్రులు స్పందిస్తూ.. “మా కూతురు తప్పు చేసి ఉంటే కఠినంగా శిక్షించండి, అవసరమైతే ఉరి తీయండి” అని ఆగ్రహం వ్యక్తం చేయగా, చేతన్ తండ్రి మాత్రం తన కుమారుడిని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని వాదిస్తున్నారు.

