Khammam: కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఒక నిండు సంసారంలో ఘోర విషాదాన్ని నింపాయి. కన్నబిడ్డలను తానే సాదుకోవాల్సిన ఒక తల్లి.. క్షణికావేశంలో ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి, ఆపై తను కూడా ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించింది.
ఈ దారుణ ఘటనలో ఇద్దరు కుమారులు కన్నుమూయగా, తల్లి చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఖమ్మం నగరంలోని గాంధీ నగర్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది.
బెట్టింగ్ వ్యసనం.. రూ. లక్షల అప్పులు
పోలీసుల కథనం ప్రకారం.. బొబ్బల లింగరాజు, స్వాతి (26) దంపతులకు వేదిక్ కుమార్ (7), తనుష్ (5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త లింగరాజుకు మద్యం తాగడంతో పాటు ఆన్లైన్ బెట్టింగ్లు కాసే అలవాటు ఉంది. ఈ వ్యసనాల వల్ల అతను సుమారు రూ. 3 లక్షల వరకు అప్పులు చేశాడు. అంతటితో ఆగకుండా, భార్య స్వాతి తండ్రి (మామగారు) దొడ్డ పూర్ణయ్య ఇచ్చిన డబ్బులను కూడా బెట్టింగ్లో పోగొట్టాడు. ఈ అప్పుల విషయమై దంపతుల మధ్య గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి.
Read also: NEET Re-exam Cheating: నీట్ రీ-ఎగ్జామ్లో మాల్ప్రాక్టీస్..వాష్రూమ్లో ఫోన్ దాచి దొరికిన అభ్యర్థి
Khammam: ఒక్కరోజు వ్యవధిలోనే ఇద్దరు పిల్లలు బలి
ఈ క్రమంలో శనివారం రాత్రి పెద్ద కుమారుడు వేదిక్ కుమార్కు అకస్మాత్తుగా వాంతులు, తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రే వేదిక్ మరణించాడు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే, ఆదివారం నాడు చిన్న కుమారుడు తనుష్ కూడా అదే రకమైన ఆరోగ్య సమస్యతో ప్రాణాలు విడిచాడు.
పిల్లల మరణం తర్వాత.. తానే ఇద్దరు కుమారులకు ఎలుకల మందు తినిపించానని, ఆ తర్వాత తాను కూడా విషం తాగానని స్వాతి తన భర్తకు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్వాతి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం అత్యంత క్లిష్టంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
భర్తపై కేసు నమోదు
తన కూతురు ఈ విపరీత నిర్ణయం తీసుకోవడానికి అల్లుడు లింగరాజు వేధింపులే కారణమంటూ స్వాతి తండ్రి పూర్ణయ్య పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖమ్మం త్రీటౌన్ పోలీసులు లింగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సరిగ్గా ఫాదర్స్ డే (తండ్రుల దినోత్సవం) నాడే భర్త బాధ్యతారాహిత్యం వల్ల ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
మంత్రుల మధ్య వైరం తెచ్చిపెట్టిన బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూముల వ్యవహారం

