Peddapalli Municipal AE: పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం జరిపిన మెరుపు దాడిలో ఒక అవినీతి అధికారి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.
పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్గా (AE) విధులు నిర్వర్తిస్తున్న కల్లేపల్లి సతీశ్ కుమార్, ఒక కాంట్రాక్టర్ నుండి రూ. 2 లక్షలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
పెద్దపల్లి పట్టణ పరిధిలోని తెనుగువాడ, కునారం రోడ్డులో చేపట్టిన హిందూ శ్మశాన వాటికల అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్కు రావాల్సిన రూ. 12.28 లక్షల తుది బిల్లు చాలా రోజులుగా పెండింగ్లో ఉంది. ఈ ఫైల్ను ప్రాసెస్ చేసి, నిధుల మంజూరు కోసం ఉన్నతాధికారులకు పంపించడానికి గానూ ఏఈ సతీశ్ కుమార్ రూ. 2 లక్షలు లంచంగా డిమాండ్ చేశాడు. లంచం ఇచ్చుకోలేని బాధిత కాంట్రాక్టర్ ఈ విషయమై కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
Read Also : Medak SIR Survey: మెదక్ జిల్లాలో 55 శాతం సర్ నమోదు: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
Peddapalli AE caught taking a bribe.
Peddapalli Municipal AE: రూ. 32 లక్షలకు పైగా అక్రమ నగదు స్వాధీనం
బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా స్కెచ్ వేసిన ఏసీబీ అధికారులు సతీశ్ కుమార్ నివాసంలో అతడు కాంట్రాక్టర్ నుండి లంచం సొమ్ము తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడి ఇల్లు, కార్యాలయంలో అధికారులు విస్తృత సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో ఏఈ ఇంట్లో లెక్కల్లో చూపని రూ. 32,31,900 అదనపు నగదు లభించడంతో ఏసీబీ అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. లంచం డబ్బుతో పాటు ఈ అక్రమ నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు కల్లేపల్లి సతీశ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నామని, తదుపరి చట్టపరమైన విచారణ నిమిత్తం ఆయనను కరీంనగర్లోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064 ద్వారా తమకు ఫిర్యాదు చేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

