AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న మద్యం రవాణా అక్రమాల కేసులో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) దర్యాప్తు వేగవంతమైంది.
ఈ స్కామ్కు సంబంధించి అరెస్ట్ అయిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్కు హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. న్యాయస్థానం ఆదేశాల అనంతరం భద్రతా సిబ్బంది ఆయన్ను చంచల్గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.
YCP Liquor Case
ఈ కేసులో భాగంగా జూన్ 18న సునీల్ కుమార్ నివాసాలు, వ్యాపార కార్యాలయాల్లో ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అనంతరం కీలక ఆధారాలు లభించడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వంలో తన తండ్రి పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో, ఆ అధికార పలుకుబడిని అడ్డం పెట్టుకుని సునీల్ మద్యం రవాణా కాంట్రాక్టులను దక్కించుకున్నారని, ఆపై పెద్ద ఎత్తున మనీ లాండరింగ్కు పాల్పడ్డారని దర్యాప్తు సంస్థ ప్రధానంగా ఆరోపిస్తోంది.
రూ.195 కోట్ల ఖజానా నష్టం.. రూ.28 కోట్ల కిక్బ్యాకులు!
కోర్టు విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది సంచలన విషయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సుదర్శన్ కన్స్ట్రక్షన్స్కు చెందిన సందీప్, ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తులతో సంబంధం ఉన్న సంస్థలకు మద్యం రవాణా కాంట్రాక్టులు అప్పగించడంలో భారీగా నిబంధనల ఉల్లంఘన జరిగిందని వివరించారు. ఈ అక్రమ ఒప్పందాల ద్వారా సునీల్ కుమార్ సుమారు రూ.28 కోట్ల మేర కిక్బ్యాకులు (కమిషన్లు) అందుకున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
అంతేకాకుండా, వీటికి అదనంగా మరో రూ.7 కోట్ల విలువైన అనుమానాస్పద కుటుంబ ఆర్థిక లావాదేవీలను కూడా తాము గుర్తించినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ రవాణా మరియు పంపిణీ అక్రమాల కారణంగా ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.195 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లిందని ఈడీ అధికారులు తమ అభియోగ పత్రంలో పేర్కొన్నారు.
AP Liquor Scam: దర్యాప్తులో కీలక పరిణామం.. ముమ్మరమైన తదుపరి విచారణ
గత వైసీపీ పాలనలో మద్యం రవాణా టెండర్లు, సరఫరా కాంట్రాక్టులలో జరిగిన అవకతవకలపై ఈడీ గత కొంతకాలంగా రహస్య దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి కుమారుడు సునీల్ కుమార్ అరెస్ట్ కావడం రాజకీయంగా, అధికారికంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఈ కుంభకోణంలో మరికొందరు కీలక నేతలు, అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్న ఈడీ.. ఆ దిశగా తదుపరి విచారణను మరింత ముమ్మరం చేసింది.

