Nellimarla Alliance Issue | విజయనగరం, జూన్ 18, ప్రభాతవార్త: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ధర్మం వికటించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎవరికి వారే అన్నట్లుగా ఇరు పార్టీల నాయకులు వ్యవహరిస్తుండటంతో కూటమి స్ఫూర్తి దెబ్బతింటోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో సైతం ప్రధానంగా జనసేన నాయకులే కనిపిస్తుండగా, తెలుగుదేశం పార్టీ నాయకులు దూరంగా ఉంటున్న పరిస్థితి నెలకొంది.
Read Also : సాయికృష్ణను హత్య చేసి..కృష్ణానదిలో అస్థికలు కలిపేశారు:కేశినేని నాని
2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించబడింది. జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి భారీ మెజార్టీతో విజయం సాధించడంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ కీలక పాత్ర పోషించిందని స్థానిక నాయకులు గుర్తుచేస్తున్నారు. అయితే ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే లోకం నాగమాధవి, ఆమె భర్త లోకం ప్రసాద్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ముఖ్య నిర్ణయాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులతో సంప్రదింపులు జరపడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
అభివృద్ధి కార్యక్రమాల నిధుల కేటాయింపు, ప్రారంభోత్సవాలు, నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో భాగస్వామ్య పక్షాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తి టిడిపి శ్రేణుల్లో పెరుగుతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లినా ఆశించిన పరిష్కారం లభించలేదని స్థానిక నాయకులు చెబుతున్నారు.
ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై కూడా నిరుద్యోగ యువతలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో కంపెనీలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రకటించినా ఆ దిశగా పురోగతి కనిపించడం లేదని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెల్లిమర్లలో నెలకొన్న ఈ పరిస్థితుల నేపథ్యంలో కూటమి భాగస్వామ్య పక్షాలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో రాజకీయంగా ఇరు పార్టీలకూ ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

