Nepal Floods : ఇటీవల సంభవించిన భయంకరమైన వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్రంగా నష్టపోయిన నేపాల్కు అంతర్జాతీయ సమాజం అండగా నిలవాలని సీనియర్ నటి మనీషా కోయిరాలా తీవ్ర ఆవేదనతో అభ్యర్థించారు.
నేపాల్ రాజధాని కాఠ్మాండూలో జన్మించి, హిందీతో పాటు తెలుగులో పలు ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె, ఒక అంతర్జాతీయ కార్యక్రమంలో మాట్లాడుతూ నేపాల్ ఆర్థిక వ్యవస్థకు టూరిజం (పర్యటకం) ఊపిరి వంటిదని గుర్తుచేశారు. గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న ప్రకృతి విపత్తుల కారణంగా నేపాల్ తీవ్రంగా దెబ్బతిన్నదని, పర్యాటకులు తిరిగి తమ దేశానికి రావడం ద్వారానే కోలుకోవడం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.

పొరుగు దేశాలు భారత్, చైనాల మద్దతుకు విజ్ఞప్తి
ప్రకృతి విపత్తు నుంచి తేరుకోవడానికి నేపాల్కు అంతర్జాతీయ స్థాయిలో విస్తృత మద్దతు అవసరమని మనీషా స్పష్టం చేశారు. ముఖ్యంగా భౌగోళికంగా, ఆర్థికంగా సహకారం అందించగల పొరుగు దేశాలైన భారత్ (IND) మరియు చైనాలు తమ దేశానికి కొండంత అండగా నిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. విపత్తు సమయాల్లో సహాయక చర్యలతో పాటు, పర్యాటక రంగ పునరుద్ధరణకు పర్యాటకులు మళ్లీ నేపాల్ బాట పట్టాలని కోరారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విపత్తు మేనేజ్మెంట్లో పొరుగు దేశాల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

