Australia: ఆస్ట్రేలియాలోని క్విన్స్లాండ్లో వైద్య మరియు న్యాయ నిపుణులను సంశ్చయానికి గురిచేసిన ఒక విచిత్రమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అప్పటికే ఐదుగురు పిల్లలకు తల్లైన 27 ఏళ్ల మహిళ, గర్భాశయం లేని కారణంగా పిల్లలు కనలేని మరో దంపతుల కోసం సరోగసీ ద్వారా బిడ్డను కనేందుకు అంగీకరించింది. ఒప్పందంలో భాగంగా వైద్యులు ఆ దంపతుల పిండాన్ని సరోగేట్ తల్లి గర్భంలో ప్రవేశపెట్టారు. అయితే, సరిగ్గా అదే సమయంలో ఆ మహిళ తన భర్త ద్వారా సహజంగా కూడా గర్భం దాల్చడం ఈ కథలోని అసలు మలుపు.

జన్యు పరీక్షల్లో బయటపడిన విస్తుపోయే నిజాలు
కొద్ది వారాల తర్వాత నిర్వహించిన అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఆ సరోగేట్ తల్లి గర్భంలో కవల పిల్లలు ఎదుగుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీనిపై మరింత లోతుగా వైద్య పరీక్షలు చేయగా అందరూ ఆశ్చర్యపోయే నిజం బయటపడింది. ఆ ఇద్దరు శిశువులలో ఒకరు సరోగసీ కోరిన జంటకు చెందిన అమ్మాయి కాగా, మరొకరు సరోగేట్ తల్లి మరియు ఆమె భర్తకు జన్మించిన అబ్బాయి అని తేలింది. ఈ అసాధారణ ప్రక్రియ ద్వారా 2025 నవంబర్లో ఆమె సిజేరియన్ ద్వారా ఒకే కాన్పులో ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది.
Australia: చట్టపరమైన చిక్కులు మరియు కోర్టు విచారణ
ఈ వింత ఘటనతో క్విన్స్లాండ్ సరోగసీ చట్టాల పరంగా పెద్ద చిక్కులు ఎదురయ్యాయి. చట్టం ప్రకారం ఒకే కాన్పులో పుట్టిన తోబుట్టువులను వేరు చేయడం లేదా ఒకరికి మాత్రమే హక్కులు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. దీంతో సరోగసీ కోరుకున్న జంట తమ కుమార్తెపై చట్టపరమైన తల్లిదండ్రుల హక్కుల కోసం స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఈ సంక్లిష్టమైన కేసును విచారించిన చిల్డ్రన్స్ కోర్ట్ న్యాయమూర్తి జోడీ వూల్డ్రిడ్జ్ ఒక చారిత్రక మరియు కీలకమైన తీర్పును వెలువరించారు.
చారిత్రక తీర్పుతో సద్దుమణిగిన సమస్య
ఈ ఇద్దరు శిశువులు ఒకే గర్భంలో పెరిగినప్పటికీ, వేర్వేరు సమయాల్లో, వేర్వేరు పద్ధతుల్లో గర్భం దాల్చడం వల్ల వీరిని ‘జన్మతః తోబుట్టువులు’గా పరిగణించలేమని, కేవలం ‘గర్భాశయ కవలలు’గా మాత్రమే చూడాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు ఇచ్చిన ఈ చారిత్రక తీర్పుతో సరోగసీ కోరిన దంపతులకు తమ కుమార్తెపై పూర్తి చట్టపరమైన హక్కులు లభించాయి. ప్రస్తుతం రెండు కుటుంబాలు ఎవరి పిల్లలతో వారు సంతోషంగా జీవిస్తుండగా, భవిష్యత్తులో ఈ పిల్లలకు వారి పుట్టుక వెనుక ఉన్న ప్రత్యేకతను వివరిస్తామని తెలిపారు.

