Ghatkesar Crime: కుటుంబ కలహాలు, అనుమానంతో భార్యను భర్త సిమెంట్ ఇటుకతో బలంగా మోది దారుణంగా హత్య చేసిన ఘాతుకం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
పోలీసుల కథనం ప్రకారం.. కాట్రావత్ రాజు (44), మాధవి (37) దంపతులు 15 ఏళ్ల క్రితం ఘట్కేసర్లోని ద్వారకానగర్కు వచ్చి స్థిరపడ్డారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే గత మూడేళ్లుగా రాజు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే భార్య ప్రవర్తనపై తీవ్ర అనుమానం పెంచుకుని ఆమెను నిత్యం శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు నిర్వహించి నచ్చజెప్పినప్పటికీ అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.
Husband beats wife to death with a cement brick while intoxicated.
Ghatkesar Crime: అర్ధరాత్రి హత్య
బుధవారం అర్ధరాత్రి సమయంలో రాజు బాగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి వేళ కుటుంబ సభ్యులంతా నిద్రపోయిన తర్వాత, భార్య మాధవి ఛాతీపై పెద్ద సిమెంట్ ఇటుకతో బలంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మాధవి అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. గమనించిన కుటుంబ సభ్యులు, పొరుగువారు వెంటనే 108 అంబులెన్స్లో రాత్రి 1.30 గంటలకు ఆమెను ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
నిందితుడిపై కేసు నమోదు.. పోలీసుల గాలింపు
ఈ దారుణ ఘటనపై మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాట్రావత్ రాజుపై హత్య నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భార్యను హత్య చేసిన అనంతరం నిందితుడు రాజు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

