Medak Road Accident: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్డెడ్ అయిన ఒక యువకుడి అవయవాలు పలువురు బాధితులకు నూతన ప్రాణదానంగా మారాయి. కుమారుడు ఇక తిరిగిరాడనే మరణవేదనను దిగమింగుకుని, కంటిపాపలా చూసుకున్న బిడ్డ అవయవాలను దానం చేయడానికి అంగీకరించిన ఆ తల్లిదండ్రుల ఔదార్యం అందరికీ మార్గదర్శకంగా నిలిచింది.
ప్రమాదం - బ్రెయిన్డెడ్గా నిర్ధారణ
వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన లొద్ద రవి ఈ నెల 2వ తేదీ ఆదివారం నాడు పెద్దశంకరంపేట నుంచి మల్కాపూర్ వెళ్లే రహదారిలోని గురుపాదగుట్ట కమాన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి అత్యవసర చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి బ్రెయిన్డెడ్ అయినట్లు నిర్ధారించారు. రవి బతికే అవకాశం లేదని, ఆయన అవయవాలు దానం చేస్తే తీవ్ర అనారోగ్యంతో ఉన్న మరికొందరికి కొత్త జీవితం లభిస్తుందని జీవన్దాన్/ఆర్గన్ డొనేషన్ నిపుణులు, వైద్యులు కుటుంబ సభ్యులకు వివరించారు.
Medak Road Accident: అవయవదానం - ఆశాకిరణంగా రవి
వైద్యుల సూచనతో రవి తల్లిదండ్రులు తమ కొడుకు భౌతిక రూపంలో లేకపోయినా మరో రూపంలో జీవించి ఉంటాడనే ఆశతో అవయవదానానికి అంగీకరించారు. దీంతో నిపుణులైన వైద్యుల బృందం గుండె, కాలేయం (లివర్), కిడ్నీలు మరియు నేత్రాలను సేకరించి అత్యవసర అవసరం ఉన్న రోగులకు శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. అనంతరం రవి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా గురువారం స్వగ్రామంలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మండలంలోని మల్కాపూర్ గ్రామంలో ఆర్ఎంపీ (RMP) వైద్యుడిగా సేవలు అందిస్తూ ప్రజల మనసులు గెలుచుకున్న రవి, మరణానంతరం కూడా అవయవదానంతో పలువురి జీవితాల్లో వెలుగులు నింపాడని గ్రామస్తులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానానికి ముందుకొచ్చిన రవి తల్లిదండ్రుల గొప్ప మనసును స్థానికులు, అధికారులు కొనియాడారు.

