Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్ రద్దుకు దారితీసిన ఆ కేసు ఏమిటి?

మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్ రద్దుకు దారితీసిన ఆ కేసు ఏమిటి?

వార్త 3 days ago

Meenakshi natarajan: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి, పార్టీ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి మంగళవారం తిరస్కరించారు.

హైదరాబాద్ కోర్టులో ఉన్న ఒక ప్రైవేట్ ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనకపోవడమే ఇందుకు కారణం.

 Madhya Pradesh Rajya Sabha Elections

అసలు ఏమిటీ వివాదం?

2025లో హైదరాబాద్‌కు చెందిన ఒక మాజీ మహిళా కాంగ్రెస్ కార్పొరేటర్, మీనాక్షి నటరాజన్‌తో పాటు మరికొందరిపై ప్రైవేట్ ఫిర్యాదు చేశారు. గతంలో తనను వేధించిన ఒక పార్టీ నాయకుడిపై 2022లో పంజాగుట్ట (హైదరాబాద్), 2023లో కుబ్బన్ పార్క్ (బెంగళూరు) పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు సదరు మహిళా నేత పేర్కొన్నారు. ఆ సమయంలో పంజాగుట్ట పీఎస్ వద్ద ఆమె నిరసన తెలపడంతో, సదరు నిందితుడు తన జిల్లా కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

Read also: Meenakshi Natarajan : కాంగ్రెస్లో సెగలు రేపుతున్న 'మీనాక్షి' వ్యవహారం

అయితే, సదరు నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దలకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని బాధితురాలు ఆరోపించారు. ఈ విషయాన్ని మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లగా, సస్పెండ్ చేశామని చెప్పారే తప్ప దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు (సస్పెన్షన్ లెటర్) ఇవ్వలేదని, పైగా ఆ నాయకుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని ఆమె ఆరోపించారు. ఈ ప్రైవేట్ ఫిర్యాదులో మీనాక్షి నటరాజన్‌ను నాల్గవ ప్రతివాదిగా చేర్చడంతో కోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది.

Meenakshi natarajan: బీజేపీ అభ్యంతరం.. నామినేషన్ రద్దు

మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ నామినేషన్ల పరిశీలన సందర్భంగా బీజేపీ ఈ కోర్టు నోటీసుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. మీనాక్షి నటరాజన్ తన అఫిడవిట్‌లో ఈ కీలక సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచారని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసింది. బీజేపీ వాదనలను పరిశీలించిన ఎన్నికల అధికారి, ఆమె నామినేషన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో, మధ్యప్రదేశ్ నుంచి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థులు తరుణ్ చుగ్, రజనీశ్ అగర్వాల్, మహేశ్ కేవత్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.

కాంగ్రెస్ ఆగ్రహం - ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన మీనాక్షి

ఈ పరిణామంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదొక “ప్రజాస్వామ్య హత్య” అని పార్టీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్‌లు మండిపడ్డారు. మరోవైపు, బుధవారం మీనాక్షి నటరాజన్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ECI) కలిసి ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చారు. సదరు కోర్టు నోటీసు కేవలం ప్రాథమిక విచారణ దశలోనే ఉందని, ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనల ప్రకారం ఇలాంటి వాటిని అఫిడవిట్‌లో వెల్లడించాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ హైడ్రామాతో మధ్యప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha