Gas - EKYC : వంటగ్యాస్ వినియోగదారులకు ఇ-కేవైసీ (e-KYC) ప్రక్రియ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇ-కేవైసీ పూర్తి చేయడానికి ప్రభుత్వ పరంగా ఆగస్టు 16 వరకు తుది గడువు ఉన్నప్పటికీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ఆగస్టు 1 నుంచే సిలిండర్ల పంపిణీని నిలిపివేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇ-కేవైసీ పూర్తి కాని వినియోగదారుల గ్యాస్ బుకింగ్లు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతున్నాయని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు వెల్లడిస్తుండటంతో సామాన్యులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. ఒకవైపు గడువు ఉన్నప్పటికీ, మరోవైపు కంపెనీలు విధిస్తున్న సాంకేతిక ఆంక్షల వల్ల నిత్యం వేలాది మంది వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
Gas ekycఇప్పటికే చేసిన వారికి ఉపశమనం: పూర్తి చేయడానికి సులువైన మార్గాలు
ఈ ప్రక్రియపై వ్యాపిస్తున్న గందరగోళంపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్పష్టతనిచ్చాయి. గతంలోనే ఇ-కేవైసీ పూర్తి చేసిన లబ్ధిదారులు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని, కొత్తగా లేదా ఇప్పటివరకు కేవైసీ చేసుకోని వారు మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించాయి. వినియోగదారుల సౌకర్యార్థం ఇ-కేవైసీ ప్రక్రియను సులభతరం చేసినట్లు తెలిపాయి. కేవలం గ్యాస్ ఏజెన్సీల వద్దే కాకుండా, సిలిండర్ సరఫరా చేయడానికి వచ్చే డెలివరీ బాయ్స్ వద్ద ఉన్న బయోమెట్రిక్ యాప్స్ ద్వారా లేదా సంబంధిత చమురు కంపెనీల అధికారిక యాప్లలో ఆన్లైన్ విధానం ద్వారా కూడా ఆధార్ నిరూపణను సులభంగా పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేశాయి.

