Ketan Agarwal Murder Case: లోహగఢ్ కోటపై పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్ తల్లిదండ్రులు తొలిసారి మీడియా ముందుకు వచ్చి స్పందించారు.
తమ కూతురిపై వస్తున్న ఆరోపణలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆమె తల్లి పూజా గోయల్, తండ్రి ప్రవీణ్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పోలీసుల దర్యాప్తులో తమ కూతురు దోషిగా తేలితే, ఆమెను కూడా అదే కోటపై నుంచి కిందకు తోసేయాలంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటి కఠిన శిక్ష పడినా తాము అభ్యంతరం చెప్పబోమని వారు స్పష్టం చేశారు.
If my daughter has truly done something wrong, impose a severe punishment - Sia’s mother.
Ketan Agarwal Murder Case: సియా తల్లిదండ్రుల సంచలన వ్యాఖ్యలు
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఫిబ్రవరిలో కేతన్, సియాల నిశ్చితార్థం ఇరు కుటుంబాల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ పెళ్లిపై నిశ్చితార్థానికి ముందే సియాను పదే పదే అడిగామని, ప్రతిసారీ తను కేతన్ను ఇష్టపడుతున్నానని, పూర్తి అంగీకారంతోనే ఉన్నానని చెప్పిందని తల్లి పూజ తెలిపారు. అయితే తన పాత ప్రేమాయణాన్ని సియా తమ వద్ద దాచిపెట్టిందని ఆమె పేర్కొన్నారు. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న చేతన్ చౌదరి కేవలం తమ కూతురికి ఒక స్నేహితుడిగా మాత్రమే తెలుసని, వారి మధ్య ప్రేమ ఉందనే విషయం పోలీసుల దర్యాప్తు ద్వారానే తమకు తెలిసిందని వెల్లడించారు.
మరోవైపు కేతన్ కుటుంబం మాత్రం ఈ వాదనలను పూర్తిగా తోసిపుచ్చుతోంది. సియాకు చేతన్తో ఉన్న సంబంధం ఆమె తల్లిదండ్రులకు ముందే తెలుసని కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ ఆరోపించారు. తమ కుటుంబానికి ఉన్న ఆర్థిక నేపథ్యం, ఆస్తిపాస్తులను చూసే సియాపై వారు ఈ పెళ్లి కోసం ఒత్తిడి తెచ్చారని ఆయన పేర్కొన్నారు. సియా వయసు చిన్నదైనప్పటికీ, వారి కుటుంబ సభ్యులు పదే పదే కోరడం వల్లే తాము ఈ పెళ్లికి ఒప్పుకున్నామని విశాల్ అగర్వాల్ స్పష్టం చేశారు.
న్యాయం జరగాలని కోరుతున్న సియా తండ్రి
ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులు సియా, చేతన్లు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఇంట్లో వాళ్ల ఒత్తిడి వల్లే తాను కేతన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని సియా చెబుతుండగా.. కుటుంబ పరువు పోతుందనే భయంతోనే తాము ముందే ఇళ్లు వదిలి వెళ్లిపోలేకపోయామని చేతన్ అంటున్నాడు. ఇదిలా ఉంటే, ఈ హత్యకు నాలుగు రోజుల క్రితమే ఒకసారి కోటపై పాము నెపంతో కేతన్ను చంపేందుకు వీరు విఫలయత్నం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేతన్ తమకు కొడుకు లాంటివాడని, ఒక అమాయకుడి ప్రాణం తీసిన వారు ఎవరైనా సరే చట్టం ముందు కఠినంగా శిక్షించబడాలని సియా తండ్రి ప్రవీణ్ గోయల్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం నిందితులిద్దరూ జూన్ 29 వరకు పోలీస్ కస్టడీలో ఉన్నారు.

