Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా రైతులను వేధిస్తున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది.
‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిషేధిత భూముల జాబితా నుంచి విముక్తి పొందిన వేలాది ఎకరాలకు సంబంధించిన యాజమాన్య హక్కు పత్రాలను రైతులకు సీఎం చేతుల మీదుగా అందజేయనున్నారు.

22-A నిషేధిత జాబితా నుంచి 2,074 ఎకరాల విముక్తి
ఈ పర్యటనలో భాగంగా బేతంచర్ల మండలం గుటుపల్లి గ్రామానికి చెందిన 897 మంది రైతులకు ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. ఏళ్ల తరబడి వివాదాల్లో ఉండి, కొనుగోళ్లు లేదా రుణాలకు వీల్లేకుండా పోయిన 2,074 ఎకరాల భూమిని 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. నేటి సభలో సీఎం చంద్రబాబు ఈ భూములను ఆన్లైన్ ద్వారా నిషేధిత జాబితా నుంచి తొలగించి, రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించనున్నారు. దీనితో పాటు బనగానపల్లె పరిధిలోని 23 మంది రైతులకు చెందిన 101 ఎకరాల చుక్కల భూముల సమస్యకు కూడా నేటితో చెక్ పడనుంది.
Chandrababu Naidu: ప్రతి నెలా 9వ తేదీన ‘మీ భూమి-మీ హక్కు’
రాష్ట్రవ్యాప్తంగా భూ రికార్డులను ప్రక్షాళన చేసి రైతులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి నెలా 9వ తేదీన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు తొలుత స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి, ఆపై బహిరంగ సభలో రైతులతో ముఖాముఖి మాట్లాడతారు.
రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల కొత్త పాస్ పుస్తకాలు
కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక ఇప్పటికే తిరుపతి (శెట్టిపల్లి), గుంటూరు (వట్టిచెరుకూరు), చిత్తూరు (కంగుంది) ప్రాంతాల్లోని దీర్ఘకాలిక భూ వివాదాలను పరిష్కరించింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,887 గ్రామాల్లో 29.04 లక్షల కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ జులై నెలలోనే మరో 428 గ్రామాల్లో 2.48 లక్షల పాస్ పుస్తకాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం నంద్యాల జిల్లాలోనే ఈ నెల 8,412 మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందనున్నాయి.
రావణ్ కేసులో కొత్త ట్విస్ట్.. రెండు బ్యాంకు ఖాతాల లావాదేవీలు నిలిపివేత

