Hydrogen Train : భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త హరిత విప్లవానికి నాంది పలుకుతూ దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ అనుకూల 'హైడ్రోజన్ రైలు' (Hydrogen Train) పట్టాలెక్కడానికి సిద్ధమైంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఈ విప్లవాత్మక రైలును అధికారికంగా ప్రారంభించనున్నారు. దేశంలో బొగ్గు, డీజిల్ వినియోగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు భారత్ వేస్తున్న అడుగులలో ఇదొక మైలురాయిగా నిలిచిపోనుంది. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు హరియాణా రాష్ట్రంలోని జింద్ (Jind) మరియు సోనిపట్ (Sonipat) స్టేషన్ల మధ్య నడపబడుతుంది. ఈ అధునాతన రైలులో మొత్తం 10 ప్యాసింజర్ కోచ్లు ఉంటాయి. ఒకేసారి గరిష్ఠంగా 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలిగే భారీ సామర్థ్యం దీని సొంతం. ఈ రైలు గంటకు 75 కిలోమీటర్ల నుండి 110 కిలోమీటర్ల (75-110 kmph) వేగంతో ప్రయాణించేలా దీనిని రూపొందించారు. కేవలం ప్రయాణికుల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, తక్కువ శబ్ద కాలుష్యంతో ప్రశాంతమైన ప్రయాణ అనుభూతిని ఈ రైలు అందించనుంది.

ప్రోటాన్ ఎక్స్ఛేంజ్ మెంబ్రేన్ టెక్నాలజీ: పర్యావరణానికి 100% రక్షణ
ఈ రైలు పనిచేసే విధానం ఆధునిక సాంకేతికతకు ఒక అద్భుత నిదర్శనం. ఈ రైలులో అమర్చిన 'ప్రోటాన్ ఎక్స్ఛేంజ్ మెంబ్రేన్ (PEM) ఫ్యూయల్ సెల్' (Proton Exchange Membrane Fuel Cell) అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ ఫ్యూయల్ సెల్ ద్వారా ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ వాయువులు ఒకదానితో ఒకటి కలిసి రసాయన ప్రక్రియ జరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా జనరేట్ అయిన కరెంట్తోనే రైలు ఇంజిన్ రన్ అవుతుంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ మొత్తం ప్రక్రియలో పర్యావరణానికి హాని చేసే కార్బన్ ఉద్గారాలు ఏవీ విడుదల కావు; కేవలం స్వచ్ఛమైన నీటి ఆవిరి (Water Vapor) మరియు వేడి మాత్రమే బయటకు వస్తాయి. శూన్య ఉద్గారాలతో (Zero Emissions) నడిచే ఈ టెక్నాలజీ దేశంలో కాలుష్య నివారణకు ఎంతగానో దోహదపడనుంది.
సొంత గూడు ఖాళీ అవుతున్నా.. మేనల్లుడినే వెనకేసుకొస్తున్న దీదీ!

