Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేపాల్‌లో జలప్రళయం.. 675కి చేరిన మృతుల సంఖ్య

నేపాల్‌లో జలప్రళయం.. 675కి చేరిన మృతుల సంఖ్య

వార్త 3 weeks ago

Nepal Floods: పొరుగు దేశమైన నేపాల్‌లో ప్రకృతి భీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా భోటే కోశి నదికి ఆకస్మికంగా వరదలు పోటెత్తడంతో పాటు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.

ఈ జల ప్రళయం కారణంగా మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 675 మృతదేహాలను వెలికితీశారు. మరో 2,498 మంది ఆచూకీ గల్లంతుకాగా, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ విపత్తు పర్యాటక రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. సుమారు 589 మంది విదేశీయులతో సహా మొత్తం 753 మంది పర్యాటకులతో సంబంధాలు తెగిపోయినట్లు నేపాల్ పర్యాటక శాఖ వెల్లడించింది.

తీవ్రంగా దెబ్బతిన్న మౌలిక వసతులు – ఖాట్మండు యంత్రాంగం విజ్ఞప్తి

ఈ భీకర వరదల ధాటికి రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లో ఆస్తమస్తులు అతలాకుతలమయ్యాయి. అనేక జలవిద్యుత్ ప్రాజెక్టులు, రవాణా మార్గాలు, వంతెనలు నీట మునిగి పూర్తిగా ధ్వంసమయ్యాయి. నిరాశ్రయులైన బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని, అత్యవసర సహాయక సామగ్రిని విరాళంగా అందించాలని ఖాట్మండు జిల్లా యంత్రాంగం స్థానిక ప్రజలకు మరియు సంస్థలకు పిలుపునిచ్చినట్లు జిన్హువా వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది.

Nepal Floods: నేపాల్‌కు అండగా నిలుస్తున్న భారత్ – నాలుగో విడత సహాయక సామగ్రి అందజేత

ఈ సంక్షష్ట సమయంలో నేపాల్‌కు అగ్రగామిగా అండగా నిలుస్తున్న భారత్, తన సహాయక చర్యలను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా నాల్గవ విడతలో 11 టన్నుల సహాయక సామగ్రిని తీసుకువెళ్లే ప్రత్యేక C-130 రవాణా విమానాన్ని నేపాల్‌కు పంపినట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. ఈ విమానంలో అత్యాధునిక గాలింపు పరికరాలతో ప్రత్యేక సాంకేతిక బృందం, మృతదేహాల గుర్తింపుకోసం ఫోరెన్సిక్ నిపుణులు, డీఎన్ఏ విశ్లేషణ కిట్లు ఉన్నాయని ఆయన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. వీటితో పాటు స్లీపింగ్ బ్యాగులు, దుప్పట్లు, ప్లాస్టిక్ షీట్లు, టార్పాలిన్లు మరియు అత్యవసర పరిశుభ్రత కిట్లను కూడా అందజేశారు.

వంతెనల నిర్మాణం మరియు కొనసాగుతున్న మానవతా సాయం

వరదల వల్ల తెగిపోయిన రవాణా వ్యవస్థను పునరుద్ధరించేందుకు భారత్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే 230 అడుగుల పొడవైన మాడ్యులర్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ సామగ్రితో కూడిన 16 ట్రక్కులు నేపాల్‌కు చేరుకున్నాయని మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, రానున్న రోజుల్లో మరో ఏడు బెయిలీ వంతెనల నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. వీటిని త్వరగా ఏర్పాటు చేయడానికి ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందాలు కూడా అక్కడికి చేరుకుంటున్నాయి. ఇప్పటివరకు మొత్తం 68.5 టన్నుల సహాయక సామగ్రిని వాయుమార్గం ద్వారా ఖాట్మండుకు తరలించినట్లు విదేశాంగ శాఖ పేర్కొంటూ, నేపాల్‌కు తమ సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేసింది.

చైనా టూరిస్ట్ కెమెరాకు చిక్కిన గ్లేసియర్ కూలిన దృశ్యాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha