Nizamabad GGH News: నిజామాబాద్ జిల్లా ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH) ను అత్యాధునిక సదుపాయాలతో కూడిన 'రిఫరల్ సెంటర్'గా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.
హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్లో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈ విషయాలను వెల్లడించారు.
Read Also : Jurala Power Generation Starts: జూరాలలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
Nizamabad GGH… State-of-the-art medical services coming soon!
Nizamabad GGH News: దశలవారీగా సూపర్ స్పెషాలిటీ సేవలు & MRI యంత్రం
నిజామాబాద్ GGHలో త్వరలోనే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు. ప్రత్యేక విభాగాలు కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ వంటి కీలక వైద్య విభాగాలను దశలవారీగా ఇక్కడ ప్రారంభించనున్నారు. రోగుల వ్యాధి నిర్ధారణను మరింత వేగవంతం చేసేందుకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన MRIయంత్రాన్ని కొనుగోలు చేస్తున్నామని, త్వరలోనే ఉచిత MRI సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు విశ్వాసం గణనీయంగా పెరిగిందని సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. నిమ్స్, గాంధీ, ఉస్మానియా తరహాలోనే నిజామాబాద్ GGH లోనూ బెడ్ల కోసం రోజూ పదుల సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. జిల్లాల్లోని ఆసుపత్రులను బలోపేతం చేయడం ద్వారా హైదరాబాద్లోని ప్రధాన హాస్పిటళ్లపై రోగుల ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.
కొత్త PHC, ట్రామా కేర్ సెంటర్లకు హామీ!
కొత్త PHCలు, ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటు విషయంలో మంత్రి సానుకూల హామీలు ఇచ్చారు. సమీక్ష సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పలు అభివృద్ధి పనులపై స్పందించిన మంత్రి, అంకాపూర్లో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) మంజూరు చేసేందుకు హామీ ఇచ్చారు. అలాగే నందిపేట్లో ఉన్న PHCని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)గా అప్గ్రేడ్ చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఇక ఇందల్వాయి వద్ద జాతీయ రహదారి సమీపంలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పెద్ద ఎత్తున వైద్యుల నియామకం
జిల్లాలో వైద్యులు, సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఇప్పటికే పలు కీలక నియామకాలు చేపట్టామని మంత్రి తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల్లో సేవల మెరుగుదల కోసం 18 మంది గైనకాలజిస్టులు, 22 మంది అనస్థీషియా నిపుణులు, 22 మంది పిల్లల వైద్య నిపుణులను నియమించినట్లు వెల్లడించారు. అలాగే సుమారు 330 మంది నర్సింగ్ ఆఫీసర్లకు పోస్టింగ్లు ఇచ్చామని చెప్పారు. ఇక జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, రేడియాలజీ విభాగాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల నియామక ప్రక్రియ కూడా కొనసాగుతోందని, ఈ నెలాఖరు నాటికి ఆ నియామకాలు పూర్తవుతాయని మంత్రి స్పష్టం చేశారు.

