Chittoor Road Accident: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు (Chittoor) జిల్లాలో సోమవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శాంతిపురం మండలంలో వేగంగా వచ్చిన ఒక టెంపో వాహనం సృష్టించిన భీభత్సానికి ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Read Also :Varanasi School Teacher Crime:దుస్తుల్లో మూత్రం పోశాడని ఇంత దారుణమా..అసలు ఏమైందంటే?
వాటర్ ట్యాంకర్ను ఢీకొట్టిన టెంపో
శాంతిపురం మండలం కడపల్లి గ్రామం వద్ద స్థానికులు మంచినీటి కోసం రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాటర్ ట్యాంకర్ నుంచి నీళ్లు పట్టుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన ఒక టెంపో వాహనం అదుపుతప్పి, అక్కడ ఉన్న వాటర్ ట్యాంకర్తో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని (బైక్) బలంగా ఢీకొట్టింది. టెంపో అత్యంత వేగంగా ఢీకొనడంతో నీళ్లు పట్టుకుంటున్న గ్రామస్థులు తీవ్రంగా గాయపడ్డారు.
నాలుగేళ్ల బాలుడు సహా ముగ్గురు మృతి

ఈ భయంకర ప్రమాద ధాటికి నీళ్లు పట్టుకుంటున్న వారిలో ముగ్గురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సుందరప్ప (60), ముని వెంకటమ్మ (50)లతో పాటు ఒక నాలుగేళ్ల పసి బాలుడు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని స్థానికులు, పోలీసులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
Chittoor Road Accident: కేసు నమోదు చేసి విచారణ
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. టెంపో డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తూ అతడిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు ప్రమాదంలో మరణించడంతో కడపల్లి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

