O Sukumari Trailer: వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్న తిరువీర్, వైవిధ్యభరిత చిత్రాల కథానాయిక ఐశ్వర్య రాజేష్ కలయికలో వస్తున్న సరికొత్త చిత్రం 'ఓ సుకుమారి'.
పల్లెటూరి నేపథ్యంలో సాగే అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ను సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ జులై 17న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.

ముట్టుకుంటే షాక్ కొట్టే సుకుమారి!
తాజాగా విడుదలైన ట్రైలర్ గమనిస్తే, కథ చాలా వినూత్నంగా మరియు నవ్వులు పూయించేలా ఉంది. సినిమాలో దామిని (ఐశ్వర్య రాజేష్) అనే అమ్మాయికి ఒక వింతైన సమస్య ఉంటుంది. ఆమెను ఎవరు తాకినా సరే.. గట్టిగా కరెంట్ షాక్ తగులుతుంది. ఈ సీక్రెట్ను దాచిపెట్టి, కుటుంబ సభ్యులు ఆమెకు హీరో తిరువీర్తో పెళ్లి చేస్తారు. పెళ్లయిన తర్వాత భార్యాభర్తల మధ్య జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్, ఆ తర్వాత వచ్చే ఎమోషన్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. పల్లెటూరి వాతావరణం, కామెడీ టైమింగ్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
O Sukumari Trailer: చిత్ర యూనిట్కు అనిల్ రావిపూడి అభినందనలు
ట్రైలర్ విడుదల చేసిన అనంతరం దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిస్తూ.. “ట్రైలర్ చాలా రిఫ్రెషింగ్గా, ఫన్ రైడ్లా ఉంది. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జోడీ స్క్రీన్పై చాలా బాగుంది. ఈ కొత్త పాయింట్ ప్రేక్షకులను బాగా అలరిస్తుందనే నమ్మకం ఉంది” అని మూవీ టీమ్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
4 భాషల్లో గ్రాండ్ రిలీజ్
ఈ సినిమాతో భారత్ దర్శన్ దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మహేశ్వర రెడ్డి మూలి ఈ క్రేజీ ప్రాజెక్ట్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ జులై 17న ఈ చిత్రం ఒకేసారి రిలీజ్ కానుంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి శిష్యుడైన భరత్ మంచిరాజు ఈ చిత్రానికి స్వరాలు అందించగా, సి.హెచ్. కుశేందర్ సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. ఈ వినోదాత్మక చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తుందని చిత్రబృందం ధీమాతో ఉంది.

