NTR Bharosa Pension; పెన్షన్ల కోసం రూ. 2,711.79 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. ప్రభుత్వం నుంచి ఇస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో పెన్షనర్ల కళ్ళల్లో ఆనందం చూడగలుగుతున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు పేర్కొన్నారు.
బుధవారం దత్తిరాజేరు మండలం పాచలవలస గ్రామంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రతి నెలా ఒకటినే పింఛన్ల పంపిణీ చేయటం జరుగుతుందనీ, పింఛన్ల పంపిణీ విధానంలో దేశానికే ఏపీ ఆదర్శం అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిపారు. రాష్ట్రంలో జూలై నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రూ. 2,711.79 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జూలై నెలకు గాను మొత్తం 62,19,648 మందికి, ఇందులో కొత్తగా మంజూరైన 7,792 మంది వితంతు లబ్ధిదారులకు జూలై 1న పింఛన్లు అందజేయడం జరిగిందన్నారు. కొత్త వితంతు పింఛన్ల కోసం రూ. 3.12 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పెన్షన్ల కోసం రూ. 68,598.44 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బుధవారం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పరిధిలోని పున్నపువారిపాళెం గ్రామంలో స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పెన్షన్లు అందించాలన్నారు.
Read Also:President Droupadi Murmu: యువత శక్తి సామర్థ్యాలు దేశానికి అవసరం: ద్రౌపదీ ముర్ము

NTR Bharosa Pension: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సంక్షేమానికి పునాదిగా అన్న ఎన్టీఆర్ గారు నిలిచారు. 1983లో ఎన్టీఆర్ గారు పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2014-19లో పెన్షన్ రూ.2 వేలు చేసిన ఘనత సీఎం చంద్రబాబు గారిదేనని, నేడు రాష్ట్రంలో సామాజిక పెన్షన్ ద్వారా లబ్ధిదారులకు రూ.4 వేల పెన్షన్ను అందిస్తున్న ఘనత కూడా కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో రూ.66 వేల కోట్లు పింఛన్ పంపిణీ కోసం ఖర్చు చేయటం జరిగిందని, తాను అధికారంలోకి వస్తే పెన్షన్ను రూ.2 వేలు నుంచి రూ.3 వేలు చేస్తానని చెప్పి.. జగన్ రెడ్డి యూ టర్న్ తీసుకున్నాడన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పెన్షన్లు పంపిణీ చేసి పేదలు మరింత గౌరవంగా జీవించేలా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, ఏఎంసీ చైర్మన్ పివివి గోపాల రాజు, దత్తిరాజేరు పార్టీ మండల అధ్యక్షులు చప్పా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Epaper: epaper.vaartha.com
భవిష్యత్తులో అన్ని ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. సీఎం చంద్రబాబు

