Elephants Menace | విజయనగరం, జూన్ 15 (ప్రభాతవార్త): అడవుల్లో ఉండాల్సిన గజరాజులు గ్రామాల్లోకి చొరబడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగుల సంచారం రోజురోజుకూ పెరుగుతుండటంతో రైతులు, గిరిజనులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణనష్టం, ఆస్తినష్టం కలిగించే ఈ సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలోని కాముడువలస, సిబిల్లి, ఘైసీల, పెద్దవలస తదితర ప్రాంతాల్లో గత రెండు వారాలుగా సుమారు ఎనిమిది నుంచి పది ఏనుగుల గుంపు సంచరిస్తోంది. పామాయిల్, అరటి పంటలను ధ్వంసం చేయడంతో పాటు వ్యవసాయ బోర్లు, డ్రిప్ ఇరిగేషన్ పైపులను కూడా నాశనం చేస్తూ రైతులకు భారీ నష్టం కలిగిస్తోంది.
Read Also : చంద్రబాబుకు వైఎస్ జగన్ అల్టిమేటమ్
లక్షల రూపాయల నష్టం
కాముడువలసకు చెందిన రైతు జి. పోలినాయుడు పొలంలోని రెండు బోర్లను ఏనుగులు ధ్వంసం చేశాయి. పామాయిల్ చెట్లను పీకేయడంతో సుమారు లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు. సిబిల్లి, ఘైసీల, పెద్దవలస ప్రాంతాల్లోని అరటి తోటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
అప్పులు చేసి సాగు చేసిన పంటలు ఏనుగుల బారిన పడటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడైన పంటల నష్టాలను అంచనా వేసేందుకు కూడా అధికారులు ముందుకు రావడం లేదని ఆరోపిస్తున్నారు. ఒక శాఖపై మరో శాఖ బాధ్యతలు నెట్టేస్తోందే తప్ప రైతులకు న్యాయం జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Elephants Menace:భయంతో వణుకుతున్న గిరిజనులు
ఏనుగుల గుంపు ఎప్పుడు గ్రామాల్లోకి వస్తుందోనన్న భయంతో గిరిజనులు రాత్రిళ్లు నిద్రపోలేకపోతున్నారు. అటవీశాఖ అధికారులు ఏనుగులను ఒడిశా వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి కదలడం లేదని సమాచారం. ప్రజల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఏనుగులను తిరిగి అడవుల్లోకి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించి గజరాజుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఉభయ జిల్లాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే పాడైన పంటలకు తక్షణ నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

