Nara Lokesh: ప్రభుత్వ ఉద్యోగ, ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు, మాల్ప్రాక్టీస్లకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసే లక్ష్యంతో తీసుకొచ్చిన 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026' లోక్సభలో ఆమోదం పొందడం పట్ల ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చట్టం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే అక్రమార్కులకు గట్టి హెచ్చరికగా నిలుస్తుందని, పరీక్షల విశ్వసనీయతను కాపాడే దిశగా ఇది ఒక కీలక అడుగు అని అభిప్రాయపడ్డారు.
Read Also : AP building rules: ఏపీలో మారిన భవన నిర్మాణ నిబంధనలు
Lok Sabha passes bill to curb exam paper leaks.
Nara Lokesh: ప్రతిభ, పారదర్శకతకే ఎప్పుడూ ప్రాధాన్యం
సోషల్ మీడియా వేదికగా స్పందించిన నారా లోకేశ్.. ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల మోసాలకు పాల్పడే వారిపై ఇక నుంచి కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కేవలం శిక్షలకే పరిమితం కాకుండా, పరీక్షల వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టిందని తెలిపారు. “యువత భవిష్యత్తు అనేది రాజకీయాలకు అతీతమైనది. ప్రతిభ, పారదర్శకత, సమాన అవకాశాలే ఎప్పుడూ గెలవాలి” అని ఆయన ఆకాంక్షించారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటన తలెత్తిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించిందని లోకేశ్ గుర్తుచేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, పరీక్షను తిరిగి సకాలంలో నిర్వహించి లక్షలాది మంది విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా కాపాడిందని కొనియాడారు.

