Khammam women police : న్యాయం కోసం వచ్చిన అభాగ్యురాలి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) ఆమెపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా బలవంతంగా గర్భస్రావం చేయించిన భయంకర ఉదంతం ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది.
రక్షించాల్సిన రక్షక భటుడే భక్షకుడిగా మారి చేసిన ఈ దారుణం తెలంగాణవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. నిందితుడైన సీఐ బానోత్ రాజు నాయక్పై క్రిమినల్ కేసు నమోదు కాగా, ఉన్నతాధికారులు ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
లొంగదీసుకుని.. విడాకులు ఇప్పించి..
ఈ దారుణానికి సంబంధించిన కథ 2023లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో మొదలైంది. భర్త వేధింపులపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక వివాహిత ఫోన్ నంబర్ తీసుకున్న అప్పటి మహిళా పీఎస్ సీఐ రాజు నాయక్, ఆమెకు మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. తాను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత తన పోలీస్ అధికార బలంతో భర్తను బెదిరించి, సదరు మహిళకు కోర్టు ద్వారా విడాకులు ఇప్పించాడు. భర్త దూరమయ్యాక ఆమె పూర్తిగా సీఐనే నమ్మి జీవిస్తున్న క్రమంలో గర్భవతి అయింది.
బలవంతపు అబార్షన్.. డీజీపీ ఆఫీసుకు అటాచ్
తాను ప్రెగ్నెంట్ కావడంతో పెళ్లి చేసుకోవాలని బాధితురాలు ఒత్తిడి తేవడంతో సీఐ రాజు నాయక్ (Khammam women police) అసలు స్వరూపం బయటపెట్టాడు. పెళ్లికి నిరాకరించడమే కాకుండా, బాధితురాలికి ఆమెకు తెలియకుండా బలవంతంగా అబార్షన్ మాత్రలు మింగించాడు. దీనివల్ల ఆమెకు తీవ్ర రక్తస్రావమై గర్భస్రావం జరిగింది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ప్రాథమిక ఆధారాల మేరకు సీఐ రాజు నాయక్పై క్రిమినల్ కేసు నమోదైంది. ప్రస్తుతం ఖమ్మం సీసీఎస్ (CCS) లో విధులు నిర్వహిస్తున్న ఆయనను తక్షణమే హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
టాప్-100 IASల్లో తెలంగాణ ఆఫీసర్లు ముగ్గురు

