EPFO Cyber Fraud Alert: దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ సేవలు అందించే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన చందాదారులను సైబర్ మోసాల పట్ల తీవ్రంగా హెచ్చరించింది.
ఈ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిజిటల్ విధానంలో మోసాలు చేసే సైబర్ నేరగాళ్లు.. పిఎఫ్ ఖాతాదారుల కష్టార్జితాన్ని దోచుకోవడానికి సరికొత్త వ్యూహాలను పన్నుతున్నారు.
ఇందులో భాగంగానే అధికారిక సంస్థల పేర్లతో నకిలీ వెబ్సైట్లు, సందేశాలను సృష్టిస్తూ ప్రజలను దారి మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పిఎఫ్ ఖాతా లేదా ఆన్లైన్ సేవలను ఉపయోగించే ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వ్యక్తిగత సమాచారంతో పాటు భారీ స్థాయిలో ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది.
Read Also : PM E Drive Scheme: EV ప్రియులకు గుడ్ న్యూస్.. పీఎం ఈ-డ్రైవ్ సబ్సిడీ పెంపు!
Urgent warning for PF account holders… EPFO issues key statement on cyber fraud!
EPFO Cyber Fraud Alert: నకిలీ ఫిషింగ్ లింక్స్తో ఊబిలోకి..
సైబర్ నేరగాళ్లు ప్రధానంగా ఫిషింగ్ అనే పద్ధతిని ఉపయోగించి ఈపీఎఫ్ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇందుకోసం వాట్సాప్, ఈమెయిల్, క్లుప్త సందేశాలు (ఎస్ఎంఎస్లు), సోషల్ మీడియా వేదికల ద్వారా ఆకర్షణీయమైన లేదా భయపెట్టే సందేశాలను పంపుతున్నారు. సాధారణంగా మీ ఈపీఎఫ్ ఖాతా నిలిచిపోబోతోందని, కేవైసీ వివరాలు అప్డేట్ కాలేదని లేదా ఖాతాలోని సొమ్ము పొందాలంటే గుర్తింపు ధృవీకరణ పూర్తి చేయాలని పేర్కొంటూ సందేశాల్లో లింక్లను జతచేస్తారు. ఆ లింక్పై క్లిక్ చేసిన వెంటనే, అది ప్రభుత్వ అధికారిక ఈపీఎఫ్ఓ పోర్టల్ను పోలి ఉండే నకిలీ వెబ్సైట్కు తీసుకువెళుతుంది. అక్కడ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు, లాగిన్ పాస్వర్డ్తో పాటు వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) వంటి అత్యంత కీలక సమాచారాన్ని నమోదు చేయమని కోరుతారు. వినియోగదారులు తెలియక ఆ వివరాలను నమోదు చేస్తే, అవి నేరుగా మోసగాళ్ల చేతికి చేరి ఖాతాలోని నిధులు క్షణాల్లో మాయమయ్యే ప్రమాదం ఉంది.
సైబర్ మోసాల నుంచి రక్షణకు పాటించాల్సిన జాగ్రత్తలు
ఈ తరహా డిజిటల్ మోసాలు, సైబర్ బెదిరింపుల నుంచి రక్షణ పొందాలంటే ఈపీఎఫ్ చందాదారులు అప్రమత్తంగా వ్యవహరించడం అత్యంత అవసరం. ఈపీఎఫ్ఓ సంస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు లేదా ఇతర సందేశాల ద్వారా పాస్వర్డ్లు, ఓటీపీలు, బ్యాంకింగ్ రహస్య వివరాలను అడగదని గుర్తుంచుకోవాలి. అలాగే కేవలం ప్రభుత్వ లోగోలు లేదా చిహ్నాలు కనిపించినంత మాత్రాన ఏ వెబ్సైట్నూ నమ్మకూడదు. మెసేజ్లలో వచ్చే లింక్లను తెరవకుండా, బ్రౌజర్లో స్వయంగా అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్ చిరునామాను టైప్ చేసి మాత్రమే సేవలను వినియోగించడం సురక్షితం. ఏదైనా లింక్పై క్లిక్ చేసే ముందు దాని వెబ్ అడ్రస్ను జాగ్రత్తగా పరిశీలించాలి. నకిలీ వెబ్సైట్లలో సాధారణంగా స్పెల్లింగ్ తప్పులు, అసహజమైన అక్షరాలు లేదా అనుమానాస్పద డొమైన్ పేర్లు కనిపిస్తాయి. అదేవిధంగా, ఖాతా నిలిచిపోతుందనే లేదా వెంటనే చర్య తీసుకోవాలనే హెచ్చరికలతో వచ్చే అత్యవసర సందేశాలకు భయపడకుండా, ముందుగా వాటి నిజానిజాలను నిర్ధారించుకోవాలి. ఏదైనా సందేహం తలెత్తితే వెంటనే సంబంధిత ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయం లేదా అధికారిక హెల్ప్లైన్ను సంప్రదించడం ఉత్తమం. సైబర్ భద్రతా సూత్రాలను పాటిస్తూ, సున్నితమైన సమాచారాన్ని ఇతరులతో పంచుకోకపోవడమే మీ పిఎఫ్ సొమ్ముకు అసలైన శ్రీరామరక్ష.
100 కోట్ల రూ.10, రూ.20 పాలిమర్ నోట్ల ట్రయల్స్కు కేంద్రం ఆమోదం!

