NEET Paper Leak : దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఈ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు.
అయితే, ఈ ఆందోళన కార్యక్రమానికి వర్షం తీవ్ర ఆటంకం కలిగించింది. దీక్షా శిబిరం వద్ద వర్షం పడుతుండటంతో, నిరసనకారులు తలదాచుకునేందుకు మరియు దీక్షను కొనసాగించేందుకు టెంట్లు (పందిళ్లు) ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. కానీ, అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులు టెంట్లు వేయడానికి అనుమతి లేదంటూ వారిని అడ్డుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
Abhijeet Dipkeఅనుమతి కోసం పోలీసుల కాళ్లు మొక్కిన అభిజీత్ దీప్కే
పోలీసులు టెంట్ల ఏర్పాటును నిలిపివేయడంతో, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమకు సహకరించాలని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పోలీసులను వేడుకున్నారు. వర్షంలో తడుస్తూ దీక్ష చేయడం కష్టతరంగా మారిందని, కనీసం టెంట్లు వేసుకునేందుకైనా అనుమతించాలని కోరుతూ ఆయన అక్కడే ఉన్న పోలీస్ అధికారుల కాళ్లపై పడ్డారు. మోకాళ్లపై నిలబడి, పోలీసుల కాళ్లు మొక్కుతూ ఆవేదన వ్యక్తం చేసిన ఈ దృశ్యాలు అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యపరిచాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటంలో భాగంగానే ఆయన అంతలా తగ్గాల్సి వచ్చిందని నెటిజన్లు కామెంట్లు పెడుతుండటంతో ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

