Telangana High Court: ప్రైవేట్ సంస్థలు మరియు వాటి ఉద్యోగుల మధ్య తలెత్తే వివాదాలు, ఫిర్యాదులపై విచారణ జరిపే పరిధి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు (హెచ్ఆర్సీ) లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
హెచ్ఆర్సీ అధికార పరిధి పూర్తిగా ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతారాహిత్యం లేదా నిర్లక్ష్యపు ధోరణులకే వర్తిస్తుందని ధర్మాసనం తన కీలక తీర్పులో వెల్లడించింది.
వెల్స్ ఫార్గో సంస్థ పిటిషన్పై హైకోర్టు విచారణ – హెచ్ఆర్సీ ఆదేశాల కొట్టివేత
ప్రముఖ ప్రైవేట్ సంస్థ అయిన వెల్స్ ఫార్గో ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్న ఇద్దరు మహిళా ఉద్యోగులు, తమకు ఆఫీసులో వేధింపులు ఎదురయ్యాయని ఆరోపిస్తూ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీనిపై హెచ్ఆర్సీ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ సదరు కంపెనీ హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం.. హెచ్ఆర్సీ ముందుకు వచ్చిన ఆ ఫిర్యాదులను కొట్టివేస్తూ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ను అనుమతించింది.
Telangana High Court: యజమాని, ఉద్యోగుల మధ్య అంతర్గత వ్యవహారమే – పోష్ చట్టం ఆశ్రయించాలని సూచన
ఉద్యోగ వివాదాలు, పనితీరు ఆధారిత మదింపు వంటి అంశాలన్నీ యజమానికి, సిబ్బందికి మధ్య ఉండే కేవలం అంతర్గత విషయాలని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఇటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇప్పటికే చట్టబద్ధమైన ప్రత్యేక వేదికలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఏమాత్రం అధికార పరిధి లేని విషయాల్లో ఆరోపణల తీవ్రతను బట్టి హెచ్ఆర్సీ తన పరిధిని విస్తరించుకోకూడదని స్పష్టం చేసింది. ముఖ్యంగా కార్యాలయాల్లో మహిళల వేధింపుల వంటి ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘పోష్ చట్టం’ (POSH Act) పక్కాగా ఉందని, బాధితులు ఆ చట్టం కింద ఉండే అంతర్గత కమిటీలను సంప్రదించాలని సూచించింది. అయితే, చట్టపరమైన ఇతర మార్గాల ద్వారా న్యాయం వెతుక్కునే స్వేచ్ఛ బాధితులకు ఎప్పుడూ ఉంటుందని తీర్పులో పేర్కొంది.
Epaper: epaper.vaartha.com

