Kandula Durgesh: వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్టుల ఉదంతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అరెస్టులపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన విమర్శలకు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అత్యంత ఘాటుగా సమాధానమిచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో కుట్రపూరితంగా అలజడిని, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడానికి ఒక ప్రత్యేక ముఠా తెరవెనుక ప్రయత్నాలు చేస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ప్రకాశ్ రాజ్, ప్రశ్న రావణ్లను సమాజ విద్రోహ శక్తులుగా అభివర్ణించిన మంత్రి.. అసలు ఆ యూట్యూబర్తో నటుడికి ఉన్న రహస్య బంధం ఏంటో బహిరంగపరచాలని డిమాండ్ చేశారు.

తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్యాకేజీలు అందుతున్నాయా?
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరిగాయని, అనేక హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని మంత్రి కందుల దుర్గేశ్ గుర్తుచేశారు. ఆ రోజుల్లో ప్రకాశ్ రాజ్ ఎందుకు నోరు మెదపలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఎందుకు విషం చిమ్ముతున్నారని నిలదీశారు. నాడు మూగనోము నోమిన ప్రకాశ్ రాజ్.. నేడు ప్రస్తుత ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రతి నెలా ఎంత మొత్తంలో డబ్బులు (ప్యాకేజీలు) అందుకుంటున్నారో చెప్పాలని మంత్రి నేరుగా ప్రశ్నించారు.
Kandula Durgesh: అశాంతి సృష్టించే కుట్రలను అణచివేస్తాం
రాష్ట్రంలో నెలకొన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి కుతంత్రాలకు పాల్పడుతున్నారని మంత్రి దుర్గేశ్ మండిపడ్డారు. ఇలాంటి విద్రోహ శక్తుల ఆటలను కూటమి ప్రభుత్వం సాగనివ్వదని, సమాజంలో అశాంతిని రేకెత్తించాలని చూసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
Epaper: epaper.vaartha.com
ఏపీలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

