Telangana Secretariat : తెలంగాణ రాష్ట్ర సచివాలయం (TG Secretariat)లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.
ఇకపై సచివాలయంలోకి సాధారణ సందర్శకులు (Visitors) ప్రవేశించాలంటే ఖచ్చితంగా ‘క్యూఆర్ కోడ్’ (QR Code) ఉండాల్సిందే. నూతన నిబంధనల ప్రకారం, సెక్రటేరియట్కు వచ్చే సందర్శకులకు సంబంధించిన అధికారులు లేదా మంత్రుల పేషీలు అనుమతి (Approve) ఇవ్వగానే, సదరు విజిటర్ మొబైల్ ఫోన్కు ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ సందేశం రూపంలో వెళ్తుంది. సచివాలయం ప్రధాన ద్వారం (గేటు) వద్ద భద్రతా సిబ్బంది ఈ కోడ్ను స్కాన్ చేసిన తర్వాతే లోపలికి అనుమతి లభిస్తుంది. అపరిచితులు, అనాధికారిక వ్యక్తులు సచివాలయంలోకి చొరబడకుండా నిరోధించేందుకు మరియు నిఘాను మరింత పటిష్టం చేసేందుకు ఈ డిజిటల్ భద్రతా విధానాన్ని అమలులోకి తెచ్చారు.

గంట మాత్రమే గడువు.. సమయం దాటితే అలర్ట్ మెసేజ్
ఈ నూతన భద్రతా వ్యవస్థ ద్వారా సందర్శకుల కదలికలను పూర్తిగా ట్రాక్ చేయనున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని లోపలికి వెళ్లిన వారు సచివాలయంలో గరిష్టంగా ఒక గంట (1 Hour) మాత్రమే గడపడానికి అనుమతి ఉంటుంది. ఒకవేళ నిర్దేశిత సమయం దాటినప్పటికీ సందర్శకులు లోపలే ఉంటే, తదుపరి క్షణమే భద్రతా సిబ్బందికి ఆటోమేటిక్గా అలర్ట్ (Alert) వెళ్తుంది. దీనితో పాటు సందర్శకుడు ఏ మంత్రి లేదా ఏ అధికారి పేషీకి వెళ్లారు? అక్కడ ఎంత సమయం గడిపారు? అనే పూర్తి వివరాలు కంప్యూటర్ డేటాబేస్లో డిజిటల్గా రికార్డ్ అవుతాయి. ఈ సరికొత్త నిబంధనల వల్ల సచివాలయంలో అనవసరపు రద్దీ తగ్గడమే కాకుండా, పరిపాలనా కేంద్రంలో పారదర్శకత, కట్టుదిట్టమైన భద్రత సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.
డ్రామారావు, అగ్గిపెట్టెరావు అంటూ హరీష్ , కేటీఆర్ లపై పొంగులేటి విమర్శలు

