Nitin Nabin: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అరెస్టు చేయడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ అణచివేత చర్య రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ దివాలాకోరుతనానికి, నియంతృత్వ వైఖరికి అద్దం పడుతోందని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి ముప్పని హెచ్చరించారు.

బాధితులకు అండగా వెళ్తుంటే అరెస్ట్ చేయడమేంటని ప్రశ్న
కాంగ్రెస్ కార్యకర్తల దాడికి గురైన నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న రాంచందర్ రావును పోలీసులు అడ్డుకోవడం అత్యంత హేయమైన చర్య అని నితిన్ నబీన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు అరాచకాలకు పాల్పడుతున్నప్పుడు ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసు యంత్రాంగం.. బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ఆయన నిలదీశారు.
Nitin Nabin: రాహుల్ గాంధీ మాటలు కేవలం నాటకాలే: విమర్శలు
రాజ్యాంగ పరిరక్షణ గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పే మాటలన్నీ కేవలం ప్రజలను మభ్యపెట్టే నాటకాలే అని నితిన్ నబీన్ దుయ్యబట్టారు. ఆచరణలో మాత్రం కాంగ్రెస్ నాయకులు తీవ్రమైన దౌర్జన్యాలు, అణచివేత ధోరణిని అవలంబిస్తున్నారని ఆరోపించారు.
ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న ఈ దౌర్జన్యాలకు, ప్రతిపక్షాలపై చేస్తున్న దాడులకు తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో తగిన రీతిలో బుద్ధి చెబుతారని నితిన్ నబీన్ హెచ్చరించారు. ఈ క్లిష్ట సమయంలో రాంచందర్ రావు కుటుంబానికి, పార్టీ శ్రేణులకు బీజేపీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

