Telangana state budget:కేంద్ర నిధులపైనే ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రుణాలు, గ్రాంట్లు, నిధులు, ప్రాయోజితక పధకాల సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికకు రూపకల్పన చేసింది.
రాష్ట్ర ఖజానా క్లిష్ట పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న నేపధ్యంలో ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, నిధులు, విసృత రుణాలపై భారీగా ఆధారపడాల్సిన పరిస్థితి తప్పడం లేదు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ఆర్థిక శాఖ దూకుడుగా రుణాలను సమీకరించే ప్రణాళికలను రూపొందించింది. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనుల కోసం కేంద్రం నుండి భారీగా రూ.1.2 లక్షల కోట్లు కోరుతోంది. దీనితో పాటు, బడ్జెటేతర రుణాల కింద మరో రూ.1 లక్ష కోట్లకు పైగా సమీకరించాలని కూడా ప్రణాళికలు రచిస్తోంది. ఆర్థిక శాఖ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం సగటున నెలకు రూ.18,500 కోట్ల ఆదాయం వస్తోంది. అయితే. తెచ్చిన అప్పుల కిస్తీలు, వడ్డీలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే ప్రతి నెలా సగటు రూ.13 వేల కోట్లు ఖర్చవుతోంది.
Telangana budgetary extra loans plan
మిగిలిన రూ.5 వేల కోట్లతోనే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి తప్పడం లేదు. ఈ నేపధ్యంలో ప్రస్తుత ఆర్థికంలో 2026-27కు సంబంధించి పన్నుల ఆదాయంపైనే సర్కార్ ఆధారపడనుంది. మొత్తం బడ్జెట్లో పన్నుల ద్వారా ఆదాయం 56 శాతం మేర వస్తుందని అంచనా వేసింది. రాష్ట్ర ఖజానాకు మొత్తం రాబడి రూ.3,24,134 కోట్లుగా బడ్జెట్ అంచనాల్లో వెల్లడించగా, ఇందులో స్వంత పన్ను వాటా రూ.1,48,165.75 కోట్లు, కేంద్ర పన్నులలో వాటా రూ.33,181.64 కోట్లుగా ప్రతిపాదించింది. ఈ రెండూ కలిసి మొత్తం పన్ను ఆదాయం . 1,81,347.39 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. అయితే బడ్జెట్ ఖర్చు కంటే వచ్చే ఆదాయం సగమే కావడంతో మిగిలిన నిధుల కోసం కేంద్రంపై ఆశలు పెట్టుకుంది. ఆర్థిక లోటును పూడ్చడానికి, ఖర్చులను కొనసాగించడానికి భారీగా గ్రాంట్లు, మోలిక సదుపాయాల కేటాయింపులు, వడ్డీ లేని రుణాలు, ప్రాజెక్టుల ఆమోదం కోసం కేంద్రంపై వత్తిడి తేచ్చి వాటిని సాధించాలని పట్టుదలతో ఉంది.
Telangana state budget:ఆదాయ వ్యయాల లెక్కలు
ప్రధానంగా 50 ఏళ్ల వడ్డీ లేని రుణాలను గ్రాంట్లుగా మార్చడం, కేంద్ర సహాయాన్ని రెట్టింపు చేయడం, విద్య, ఆరోగ్య రంగాల ఖర్చులను ఎఫిర్బిఎం పరిమితుల నుండి మినహాయిం చడం, రాష్ట్రాల కోసం ఆర్ధిక లోటు పరిమితిని 4 శాతానికి పెంచడం వంటివి ఉన్నాయి. అలాగే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2, రీజినల్ రింగ్ రోడ్, నాలుగు జిల్లాల్లో కొత్త విమానాశ్రయాలు, పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా, మూసీ నది అభివృద్ధి, రేడియల్ రోడ్లు, నగర మురుగునీటి వ్యవస్థ విస్తరణ కోసం భారీ ప్రాజెక్టుల మంజూరుకు కూడా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా, వీటన్నింటికీ కేంద్రం నుండి గణనీయమైన భాగస్వామ్యం అవసరమని భావిస్తున్న ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.1.3 లక్షల కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రతిపాదించింది.
కేంద్రంపై ఒత్తిడి
అంతేకాకుండా అదనంగా, కేంద్ర పన్నులలో వాటా పెంచేలా వత్తిడి తెస్తోంది. ఆర్థిక సంఘం 41 శాతం పన్నుల పంపిణీని సిఫార్సు చేసినప్పటికీ, సెస్సులు, సర్ ఛార్జీల కారణంగా వాస్తవ రాబడి దాదాపు 30 శాతానికి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో సర్చార్జీలు, సెస్సుల ద్వారా సేకరించిన రూ.1.55 లక్షల కోట్లలో గణనీయమైన భాగాన్ని సదుపాయాల నిధులకు మళ్లించడం లేదా పంపిణీ చేయగల పన్నుల పూల్లో చేర్చాలని రాష్ట్రం కోరుతోంది. దీంతో పాటు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఇతర ఆరోగ్య మౌలిక సదుపాయాల కోసం సుమారు రూ.33 వేల కోట్ల రుణం తీసుకోవడానికి ఆమోదం కోరింది. మౌలిక ఈ రుణాలను సుమారు రూ.70 వేల కోట్ల మార్కెట్ రుణాలకు అదనంగా, ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ పరిమితికి వెలుపల కోరినట్లు ఆర్థిక శాఖలోని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్: సంచలనం రేపిన అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు

