AP gold mines: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతంలో సహజ వనరుల వేటపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో బంగారు గనుల అన్వేషణ ప్రక్రియను మరింత ముమ్మరం చేసింది.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిక్షేపాలు బయటపడగా, తాజాగా మరికొన్ని ప్రాంతాల్లో బంగారం నిల్వలు ఉన్నట్లు మైనింగ్ అధికారులు గుర్తించారు. గతంలో కర్నూలు జిల్లా జొన్నగిరి, చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించి తవ్వకాలు, పరిశోధనలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా శ్రీసత్యసాయి జిల్లాలోని జౌకల, రామగిరి ప్రాంతాల్లోనూ భారీగా బంగారం నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో ఈ ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
Gold mines in Rayalaseema… Deposits identified in Sri Sathya Sai district!
AP gold mines: జౌకలలో వేగవంతమైన ఖనిజాన్వేషణ
ముఖ్యంగా శ్రీసత్యసాయి జిల్లాలోని ఎన్పీకుంట మండలం జౌకల ప్రాంతంలో ఖనిజాన్వేషణ ప్రక్రియను అధికారులు శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ప్రాంతంలో బంగారం నిల్వల పరిమాణాన్ని, నాణ్యతను అంచనా వేసేందుకు వీలుగా పక్కా ప్రణాళికతో పరిశోధనలు నిర్వహిస్తున్నారు. జౌకల ప్రాంతంలో ఖనిజ నిల్వల అన్వేషణ కోసం మొత్తం ఆరు బ్లాకులను కేటాయించారు. ఇక్కడ నాలుగు దశల్లో సమగ్ర పరిశోధనలు జరగనున్నాయి. ఈ అత్యంత సాంకేతిక ప్రాధాన్యత కలిగిన పరిశోధనల బాధ్యతలను ప్రభుత్వం ఆరు ప్రముఖ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. ఈ ఏజెన్సీల నివేదికల ఆధారంగా తదుపరి తవ్వకాల ప్రక్రియపై స్పష్టత రానుంది.

