Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాయిలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం!

రాయిలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం!

వార్త 1 week ago

Rayilapur Fire Accident: మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని రాయిలాపూర్ గ్రామంలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పొలాల్లోని వరి కొయ్యకాలకు (పంట అవశేషాలు) నిప్పంటించడంతో ప్రారంభమైన మంటలు ఒక్కసారిగా అదుపుతప్పి, సమీపంలోని పశువుల కొట్టాలు, గడ్డి వాములకు వ్యాపించాయి.

ఈ ప్రమాదంలో కేవలం ఐదు రోజుల వయసున్న చిన్న దూడ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమవ్వడం స్థానికులను తీవ్ర కలచివేసింది.

Read also: Sathupalli Singareni : సత్తుపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ప్రమాదం

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయిలాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లో కొందరు రైతులు వరి కోతల అనంతరం మిగిలిన కొయ్యకాలను తగులబెట్టే ప్రయత్నం చేశారు. అయితే, వేసవి తీవ్రతకు తోడు బలమైన గాలులు వీయడంతో మంటలు క్షణాల వ్యవధిలో పక్కనే ఉన్న పశువుల కొట్టాలు, నిల్వ ఉంచిన గడ్డి వాములకు చుట్టుముట్టాయి.

చిన్న దూడ సజీవ దహనం..

మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో పశువుల కొట్టంలో కట్టేసి ఉన్న పశువులు భయంతో అల్లాడిపోయాయి. పెద్ద పశువులను ఎలాగోలా కాపాడినప్పటికీ.. కొట్టంలోనే ఉన్న ఐదు రోజుల చిన్న దూడను కాపాడే అవకాశం లేకపోయింది. కళ్లముందే ఆ మూగజీవి మంటల్లో కాలి బూడిదవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల రైతులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుని నీళ్లు, ఇసుకతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలు పరిసర ప్రాంతాల వ్యవసాయ క్షేత్రాలకు కూడా విస్తరించాయి.

Rayilapur Fire Accident: రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది..

మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న రామాయంపేట అగ్నిమాపక సిబ్బంది (Fire Department) వెంటనే ఫైర్ ఇంజిన్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో భారీగా గడ్డి వాములు, వ్యవసాయ సామాగ్రి దెబ్బతినడంతో రైతులకు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వేసవి కాలం కావడం, గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పంట అవశేషాలను, వరి కొయ్యకాలను తగులబెట్టే సమయంలో రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, పొరపాట్లు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అగ్నిమాపక మరియు రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha