Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరి పోలీస్ స్టేషన్ల మెట్లెక్కింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ శ్రేణులు షాద్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్లలో వరుసగా ఫిర్యాదులు చేయడం తీవ్ర కలకలం రేపింది.
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR), వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత అనుచిత వ్యాఖ్యలు చేశారని గులాబీ నేతలు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులంతా కదలివచ్చి పోలీస్ స్టేషన్లలో లిఖితపూర్వకంగా అర్జీలు సమర్పించారు.

హింసను ప్రేరేపించేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
రాజకీయ విమర్శల హద్దులు దాటి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
“బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని పంటలపై చల్లితేనే పంటలు బాగా పండుతాయని ముఖ్యమంత్రి మాట్లాడటం అత్యంత దారుణం. ఈ వ్యాఖ్యలు సమాజంలో హింసను ప్రేరేపించేలా, శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగించేలా ఉన్నాయి” అని గులాబీ శ్రేణులు మండిపడ్డాయి.
Revanth Reddy: రేవంత్ రెడ్డిపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసుకు డిమాండ్!
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం భావవ్యక్తీకరణ కిందకు రాదని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు పట్టుబడుతున్నారు.
భారతీయ న్యాయ సంహిత 2023 (BNS) లోని సంబంధిత సెక్షన్ల కింద సీఎం రేవంత్ రెడ్డిపై తక్షణమే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి, చట్టప్రకారం విచారణ జరపాలని వారు పోలీసులను డిమాండ్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూస్తూ, సమాజంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న సీఎం వైఖరిపై చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై ఒకే నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.

